హైద్రాబాద్ లేదా ప్రత్యేక హోదా!: పవన్ కళ్యాణ్కి ప్రశ్న, బాబుకు బిజెపి చిక్కు
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన కేంద్రం షాకిచ్చింది. దీనిపై మిత్ర పక్షం తెలుగుదేశం పార్టీతో పాటు వివిధ పార్టీలు భారతీయ జనతా పార్టీ పైన మండిపడుతున్నాయి. ఇప్పటికైనా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రోడ్డు పైకి రావాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.
పలువురు నేతలు కేంద్రం పైన దుమ్మెత్తి పోస్తున్నారు. నాడు ప్రత్యేక హోదా కోసం హామీ ఇచ్చి, ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడుతున్నారు. హోదా విషయంలో కేంద్రమంత్రి ప్రకటన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కూడా చిక్కులు తెచ్చింది.
ఎట్టి పరిస్థితుల్లోను ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒకరు అంటే, హోదా ఇవ్వకుంటే మూల్యం చెల్లించక తప్పదని మరొకరు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేక హోదా కాదంటే వెంటనే హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని ఇంకొకరు డిమాండ్ చేస్తున్నారు.
ప్రత్యేక హోదా పైన కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ శుక్రవారం లోకసభలో ప్రశ్నోత్తరాల సమయంలో స్పందించారు. బీహార్కు ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇచ్చామని, ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటన ఏపీ ప్రజల పైన, పార్టీల పైన ఒక్కసారిగా బాంబుపడినట్లయింది.
ఇన్నాళ్లూ ప్రత్యేక హోదా పైన ఏపీ ఆశలు పెట్టుకుంది. టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా పైన కేంద్రమంత్రుల ప్రకటన బాధ్యతారాహిత్యమని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా పైన తగ్గేది లేదన్నారు. హోదాను సాధిస్తామని చెప్పారు.
ప్యాకేజీతో తమను సంతృప్తి పరచలేరని, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని జూపూడి ప్రభాకర రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తున్న పక్క రాష్ట్రాలతో జగన్ చేతులు కలుపుతున్నారని ఆరోపించారు. హోదా పైన టిడిపి తగ్గదన్నారు.
ప్రత్యేక హోదా పైన బిజెపి మాట మార్చడం సరికాదని ఎపిసిసి చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. విభజన సమయంలో ఏపీకి ఐదేళ్లు కాదు.. పదేళ్లు హోదా కావాలన్న బిజెపి ఇప్పుడు దానిని పక్కన పెట్టడం విడ్డూరమన్నారు. హోదా కోసం పోరాడాతామని చెప్పారు.
ప్రత్యేక హోదా పైన బిజెపి వెనక్కి తగ్గితే.. చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని, వెంటనే కేంద్రంలో తన మంత్రులచే రాజీనామా చేయించాలని వైసీపీ నేత పార్థసారిథి డిమాండ్ చేశారు. తాము హోదా కోసం ఢిల్లీ స్థాయిలో పోరాడుతామని చెప్పారు. బాబు మాట్లాడాలని, దీనిపై తాము 10వ తేదీన ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు.
ప్రత్యేక హోదా విషయమై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ట్వీట్లు ఆపేసి, రోడ్డు పైకి రావాలని నటుడు శివాజీ డిమాండ్ చేశారు. ఎంపీలు దద్దమ్మలని మండిపడ్డారు. చంద్రబాబు, జగన్లు ఓటుకు నోటు, ఆస్తుల కేసుల విషయమై భయంతో మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదా కోసం ఏపీకి చెందిన ఎంపీలు రాజీనామా చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. హోదా ఇచ్చేది లేదని లోకసభలో కేంద్రమంత్రి మాట్లాడుతుంటే ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీకి హోదా కోరుతూ రేపటి నుంచి శ్రీకాకుళం నుంచి అనంతకు బస్సుయాత్ర చేస్తామన్నారు. ఆగస్ట్ 11న బందుకు పిలుపునిస్తామన్నారు.
ప్రత్యేక హోదా విషయంలో ఏపీని ప్రత్యేకంగా చూడాలని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదన్నారు. హోదా పైన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటన చేశారని చెప్పారు.