'జీవో-44 సడలింపు ఓ భారీ కుట్ర, లోకేష్ బినామీలంతా భూములు కొన్నారు'
ఆంక్షల పేరుతో రైతులను భయపెట్టిన మంత్రి నారా లోకేష్, ఆయన బినామీలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని జోగి రమేష్ ఆరోపించారు.
విజయవాడ: జీవోల సడలింపు విషయంలో ప్రభుత్వ తీరును తప్పుపడుతూ వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఆర్డీఏ పరిధిలోని జీవో నం.44ను సడలించడం వెనుక భారీ కుట్ర దాగుందని ఆరోపించారు. గతంలో జీవో నం.44ను రద్దు చేయాలని ప్రతిపక్షం ఆందోళన చేసినా పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడేమో హడావుడిగా జీవోను సడలించిందని మండిపడ్డారు.
ఆంక్షల పేరుతో రైతులను భయపెట్టిన మంత్రి నారా లోకేష్, ఆయన బినామీలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని జోగి రమేష్ ఆరోపించారు. ఆ కొనుగోళ్లు పూర్తయిన వెంటనే జీవోను సడలించారని అన్నారు. జీవో నం.44 కాంగ్రెస్ హయాంలో వచ్చిందన్న ఆరోపణలపై చర్చకు సిద్దమని జోగి రమేష్ సవాల్ విసిరారు.
సీఆర్డీఏలో సభ్యుడు కూడా కానీ లోకేష్.. ఆ కమిటీ సమావేశంలో ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. కాగా, స్థానిక సంస్థల అధికారాలను కలెక్టర్ల పరిధిలోకి తీసుకొచ్చేలా గతంలో ఏపీ సర్కార్ జీవో నం.44 తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసిన ఈ చీకటి జీవోను ఉపసంహరించుకోవాలని అప్పట్లో వైసీపీ ఆందోళన చేసింది.