నకిలి సర్టిఫికెట్లు: 1,400 మంది టీచర్లు రిజైన్
పట్నా: నకిలి సర్టిఫికెట్లు సమర్పించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన టీచర్లు స్వచ్చందంగా తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఇంటికి వెళుతున్నారు. బీహార్ లో స్వచ్చందంగా 1,400 మంది టీచర్లు తమ ఉద్యోగాలు వదిలి పెట్టి ఇంటికి వెళ్లారు.
బీహార్ లో నకిలి సర్టిఫికెట్లు ఇచ్చి వేలాధిమంది టీచర్ ఉద్యోగాలు సంపాదించిన విషయం తెలిసిందే. నకిలి సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు పొందిన వారు స్వచ్చందంగా తమంతట తాముగా రాజీనామా చెయ్యాలని, లేందంటే పరిస్థితి వేరుగా ఉంటుందని పాట్నా హైకోర్టు హెచ్చరించింది.
రాజీనామా చెయ్యకుంటే హైకోర్టు చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని భయపడిన టీచర్లు తమ ఉద్యోగాలకు స్వచ్చందంగా రాజీనామా చేశారని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. రాబోయే రోజులలో నకిలి టీచర్లు మరింత మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తారని వారంటున్నారు.
నకిలి సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు సంపాదించిన వారు ఈ నెల 8వ తేది లోపు రాజీనామా చెయ్యడానికి అవకాశం కల్పించారు. 9వ తేదీ నాటికి ఎంత మంది రాజీనామా చేశారనే విషయం తెలుస్తుందని విద్యాశాఖ సీనియర్ అధికారులు అంటున్నారు.