నయవంచన: తమవాడే అని నమ్మినందుకు.. యువతిపై అత్యాచారం, హత్య!
పలుమార్లు పవిత్ర వద్ద డబ్బులు కూడా తీసుకున్నాడు. తిరిగి ఇచ్చేస్తానని చెప్పడంతో పవిత్ర కూడా అడిగిన వెంటనే డబ్బు ఇచ్చేది. అయితే కొద్దిరోజుల క్రితం డబ్బు ఇవ్వాల్సిందిగా పవిత్ర.. తిలక్ పై ఒత్తిడి తెచ్చింద
బెంగుళూరు: తమ దేశస్తుడే కదా! అని చేరదీస్తే.. చేరదీసినవారినే పొట్టనబెట్టుకున్న ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. పలుమార్లు సహాయం పొందిన విషయం కూడా మరిచిపోయి.. చేయూతనిచ్చిన మహిళనే ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. నమ్మి చేరదీసినందుకు నయవంచన అంటే ఏంటో చూపించాడు.
పోలీసుల కథనం ప్రకారం.. దక్షిణ కర్ణాటకలోని బనశంకరి, సర్జాపురలో నేపాల్ కు చెందిన పవిత్ర(20)అనే మహిళ భర్తతో కలిసి నివసిస్తోంది. భర్త స్థానికంగా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పవిత్రకు రెండేళ్ల క్రితం ఓ యువకుడితో పరిచయం అయింది. తిలక్ అనే ఆ యువకుడు నేపాల్ వ్యక్తి కావడంతో త్వరగానే పవిత్ర కుటుంబానికి దగ్గరయ్యాడు.
ఈ క్రమంలో తరుచుగా పవిత్ర ఇంటికి వస్తూ.. వెళ్తుండేవాడు. పలుమార్లు పవిత్ర వద్ద డబ్బులు కూడా తీసుకున్నాడు. తిరిగి ఇచ్చేస్తానని చెప్పడంతో పవిత్ర కూడా అడిగిన వెంటనే డబ్బు ఇచ్చేది. అయితే కొద్దిరోజుల క్రితం డబ్బు ఇవ్వాల్సిందిగా పవిత్ర.. తిలక్ పై ఒత్తిడి తెచ్చింది. తిలక్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో.. అందరి ముందు నిలదీసింది.
దీంతో నలుగురిలో పరువు తీసిందని తిలక్ రగిలిపోయాడు. ఒకరోజు ఫోన్ చేసి.. డబ్బులిస్తా రమ్మని చెప్పాడు. ఆపై ఓ రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి, తొలుత అత్యాచారానికి ఒడిగట్టి, అనంతరం ఒక బండరాయితో ఆమె తలపై మోది హత్య చేశాడు. పవిత్ర కనిపించకపోవడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు తిలక్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.