ఘోర ప్రమాదం: బస్సు బోల్తా, 10 మంది మృతి, 20మందికి గాయాలు
రాంచి: ఝార్ఖండ్లోని గర్హ్వా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ నుంచి పట్నా వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు గర్హ్వా జిల్లాలో అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు గర్హ్వాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 3గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు క్షతగాత్రులు తెలిపారు. ఘటనా స్థలం వద్ద పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
భవనం కూలి ఐదుగురు మృతి
తిరువరూర్: కొత్తగా నిర్మిస్తున్న సెంట్రల్ యూనివర్సిటీ స్టాఫ్ క్వార్టర్స్ భవనం కూలిపోయిన సంఘటనలో ఐదుగురు మృతిచెందగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరగవచ్చునని పోలీసులు తెలిపారు.
సంఘటన జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రత్యేక డాక్టర్ల బృందాన్ని సంఘటన స్థలానికి పంపించారు. ఈ బృందం గాయపడిన వారికి ప్రథమ చికిత్స నిర్వహించి, అనంతరం తంజావూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.