నిర్భయ రేప్కేసు నిందితుడితో సహా మూడేళ్లలో 11 మంది ఖైదీల ఆత్మహత్య
న్యూఢిల్లీ: గడచిన మూడేళ్లలో ఢిల్లీ జైలులో 11 మంది ఖైదీలు ఆత్మహత్య చేసుకున్నట్లు జైలు అధికారులు వెల్లడించారు. వీరిలో గత ఏడాది డిసెంబర్ 16న జరిగిన గ్యాంగ్ రేప్ కేసు నిందితుడు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ మూడేళ్లలో మరో 16 మంది ఖైదీలు ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు.
ఢిల్లీలో రెండు జైలు కాంప్లెక్స్లున్నాయి. వీటిలో ఒకటి ప్రపంచంలోనే అతిపెద్ద జైళ్లో ఒకటిగా భావించే తీహర్ జైలు కాగా.. మరొకటి రోహిణి జైలు కాంప్లెక్స్లోని జిల్లా జైలు. మొత్తం పది జైళ్లలో 6,250 మంది పట్టేంత సామర్థ్యం ఉంటే నిబంధనలకు విరుద్ధంగా 12 వేల మంది ఖైదీలు జైళ్లలో ఉన్నట్టు అధికారిక గణాంకాలు వెల్లడించాయి.
జైలులో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలు మానసిక ఒత్తిడికి లోనై ఈ ఆత్మహత్యలకు పూనుకుంటున్నారని జైలుశాఖ అధికారులు పేర్కొన్నారు. డిసెంబర్ 16న జరిగిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో ప్రధమ ముద్దాయి రమణ్ సింగ్ 2013లో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇలాంటి సంఘటలను పునరావృతం కాకుండా చూసేందుకు గాను జైలు అధికారులు ప్రతి వార్డులోనూ "గుమ్సమ్ పంచాయత్" పేరుతో వెల్ ఫేర్ ఆఫీసర్లు, కౌన్సిలర్లు ద్వారా ఖైదీల్లో మానసిక ఒత్తిడి పొగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే డిసెంబర్ 11 నాటికి 40 మంది ఖైదీలకు పేరోల్/బెయిల్ లభించినా వారిని జైలు అధికారులు హామీ, ఆర్ధిక నిబంధలను దృష్టిలో పెట్టుకుని విడుదల చేయలేదని తెలిపారు. జైలు పరిసర ప్రాంతాల్లో ఖైదీలు మొబైల్ ఫోన్ వినియోగించకుండా 32 సెల్ ఫోన్ జామర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఢిల్లీలోని జైళ్లలో ఖైదీల కార్యకలాపాలను నిఘా ఉంచేందుకు గాను 258 సీసీకెమెరాలను ఏర్పాటు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. వీటితో పాటు త్వరలో 233 సీసీకెమెరాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.