విషాదం: పొగ మంచుకు 13 మంది టీచర్లు బలి
పొగ మంచు పంజాబ్లో 13 మందిని బలి తీసుకుంది. పొగ మంచు కారణంగా రెండు వాహనాలు ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది టీచర్ల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.
చండీఘర్: పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొగ మంచు కారణంగా చూపు సరిగా ఆనకపోవడంతో రెండు వాహనాలు ఢీకొని ప్రమాదం సంభవించింది. టీచర్లు ప్రయాణిస్తున్న వాహనం ట్రక్కును ఢీకొట్టింది. దీంతో 13 మంది టీచర్లు మృత్యువాత పడ్డారు.
చండీఘర్కు 320 కిలోమీటర్ల దూరంలో గల ఫజిల్క, ఫిరోజ్పూర్ జాతీయ రహదారిపై గల చాంద్మజ్రి గ్రామ సమీపంలో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. మృతుల్లో మహిళా టీచర్లతో పాటు కొత్తగా చేరినవారు కూడా ఉన్నారు.
మృతులు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. తమ సంస్థలకు వెళ్తున్న క్రమంలో వారు ప్రమాదానికి గురయ్యారు. ఫజిల్లా, అబోర్ బెల్ట్కు చెందిన 15 మంది టీచర్లు వాహనంలో ఉన్నారు. ట్రక్కు డ్రైవర్, క్లీనర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
టీచర్లు తమ తమ పాఠశాలలకు ప్రతి రోజూ అదే వాహనంలో వెళ్తుంటారు. ప్రమాదం ఉదయం గం.8.15 నిమిషాలకు జరిగింది. ట్రక్కు డ్రైవర్ టీచర్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని దాటేసి వెళ్లడానికి ప్రయత్నించి క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.