అత్యాచారం అడ్డుకుందని కాల్చేశారు, బాలిక మృతి
ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. బాలిక పైన అత్యాచారానికి యత్నించి, నిప్పు అంటించిన వారిలో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లోని షాజహాన్పురలో జరిగింది. ఈ సంఘటన నవంబర్ 17వ తేదీన చోటు చేసుకుంది.
దాడికి పాల్పడ్డ ఆరుగురు బాలిక గ్రామానికి చెందిన వారు. ఆమె తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వారు ఆమె పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అత్యాచారయత్నం చేశారు. వారిని ఆమె సమర్థవంతంగా ఎదిరించింది. దీంతో వారు ఆమె పైన కిరోసిన్ పోసి, నిప్పు అంటించారు. అనంతరం వారు అక్కడి నుండి పారిపోయారు.
గాయాలపాలైన బాలికను స్థానికులు షాజహాన్పుర మెడికల్ కళాశాల ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. రెండు రోజుల అనంతరం బరేలీ మెడికల్ కళాశాలకు తరలించారు. అనంతరం ఉత్తమ వైద్య చికిత్స కోసం మరో ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. బుధవారం ఆమె మృతి చెందింది. నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.