9 ఏళ్ల బాలికపై 16 బాలుడి అత్యాచారం, హత్య
కర్ణాటక : తొమ్మిదేళ్ల వయస్సు గల బాలికపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసిన కేసులో 16 ఏళ్ల బాలుడిని కోర్టు దోషిగా తేల్చింది. అందుకుగాను అతన్ని మూడేళ్ల పాటు అబ్జర్వేషన్ హోంలో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సంఘటన ఈ ఏడాడి మే 31వ తేదీన కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులోని హెబ్బగొడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బిఎంటిసి కండక్టర్ అయిన బాలిక తండ్రి చౌహాన్ పాత చందాపురాలో అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. అతని కుటుంబ సభ్యులు సోంత పట్టనం విజయపురా (బీజాపూర్)లో ఉంటున్నారు. వేసవి సెలవులు కావడంతో భార్యాపిల్లలు చౌహాన్ వద్దకు వచ్చారు.
చౌహాన్ ఇంటి సమీపంలోని వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న నిందితుడు మే 31వ తేదీ సాయంత్రం మామిడి పళ్లు ఇస్తానంటూ ఆశ చూపి, పాత చంద్రపురా బస్టాండ్ వెనక గల పాత పాఠశాల భవనంలోకి తీసుకుని వెళ్లాడు. అక్కడ అమ్మాయిని అతను హత్య చేశాడు. తీవ్రంగా రక్తస్రావం జరిగి బాలిక మరణించింది.
బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించడం ప్రారంభించారు. సాయంత్రం ఓ బాలుడితో ఆమెను చూసినట్లు బాలిక సోదరి చెప్పింది. దాంతో తల్లిదండ్రులు ఆ బాలుడిని అడిగారు. అయితే, తనకు ఏమీ తెలియదని అతను చెప్పాడు. దాంతో తల్లిదండ్రులు మిస్సింగ్ కింద ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో అతను నేరాన్ని అంగీకరించాడు.
బాలుడు ఇచ్చిన సమాచారం మేరకు పాఠశాల భవనానికి పోలీసులు చేరుకున్నారు. అక్కడి మరుగుదొడ్డిలో బాలిక శవం కనిపించింది. హెబ్బగొడి పోలీసులు దర్యాప్తు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. నిందితుడు మైనర్ కావడంతో విచారణ మడివాలలోని జువెనైల్ జస్టిస్ బోర్డు చేపట్టింది.