కొండచరియలు విరిగిపడి 18 మంది సజీవ సమాధి
డార్జిలింగ్: పశ్చిమ బెంగాల్ లో కొండచరియలు విరిగిపడి 18 మంది సమాధి అయ్యారు. డార్జిలింగ్ జిల్లాలో గత రెండు మూడు రోజుల నుండి భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కుర్సేంగ్ సబ్ డివిజన్, కలింపాంగ్ ప్రాంతాలలో మంగళవారం రాత్రి కొండచరియలు విరిగిపోయాయి.
సుమారు 25 వేర్వేరు ప్రాంతాలలో కొండచరియలు విరిగిపోవడంతో 18 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శిథిలాల కింద నుండి వారి మృతదేహాలను బయటకు తీసి ఆసుపత్రులకు తరలించారు. కొండచరియలు తొలగించడానికి అధికారులు నానా తంటాలుపడుతున్నారు.
కొండ చరియలు విరిగిపడటంతో మరొ 15 మంది గల్లంతు అయ్యారని అధికారులు తెలిపారు. వారి కోసం వివిధ ప్రాంతాలలో గాలిస్తున్నారు. డార్జిలింగ్- సిక్కిం లను కలిపే 10వ నెంబర్ జాతీయ రహదారి మీద కొండ చరియలు విరిగిపడ్డాయి.
మంగళవారం రాత్రి నుండి డార్జిలింగ్- సిక్కిం మార్గంలో వాహన సంచారం పూర్తిగా స్థంభించింది. విషయం తెలుసుకున్న అధికారులు బుధవారం జాతీయ రహదారి దగ్గరకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత చర్యగా కొన్ని ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.