మోడీ నిర్ణయం: ‘84 అల్లర్ల’ బాధితులకు పరిహారం
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం చెలరేగిన అల్లర్లలో మరణించిన సిక్కుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం గురువారం సంచలన నిర్ణయం తీసుకుంది. 1984లో జరిగిన అల్లర్ల బాధితుల కుటుంబాలకు రూ. 5 లక్షల రూపాయలను చెల్లించాలని మోడీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది.
ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా 3,325 మంది సిక్కు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. గతంలో ఢిల్లీలో షీలాదీక్షిత్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చినా.. అమలు చేయడంలో విఫలమయ్యాయి.
డేరా బాబాను అభినందించిన ప్రధాని మోడీ
తన పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ మత గురువు డేరా బాబాగా ప్రసిద్ధికెక్కిన రామ్ రహీం సింగ్ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. రామ్ రహీం సింగ్ తన భక్తులతో కలిసి చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు.
ఇలాంటి ప్రముఖ వ్యక్తులు ముందుకు రావడం వల్ల దేశ వ్యాప్తంగా ప్రజలు చైతన్యవంతులవుతారని మోడీ ట్వీట్ చేశారు. అంతకుముందు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న అమితాబ్ బచ్చన్, భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్లను మోడీ అభినందించారు.
దమ్ముంటే నల్లకుబేరుల పేర్లు బయటపెట్టండి: దిగ్విజయ్
కేంద్రానికి దమ్ముంటే నల్లకుబేరుల పేర్లు బయటపెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సవాల్ విసిరారు. ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో కల్కి మహోత్సవాలు ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వంద రోజుల్లో నల్లధనం వెనక్కి రప్పించి, ప్రతి వ్యక్తి ఖాతాలో మూడు లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పిన వ్యాఖ్యల్ని అమలు చేయడంలో బిజెపి, ప్రధాని నరేంద్ర మోడీ విఫలమయ్యారని ఆరోపించారు.
కేంద్రానికి దమ్ముంటే విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న వారి ఖాతా వివరాలు వెల్లడించాలని దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. జన్ ధన్ యోజన కోసం తాము ఓపెన్ చేసిన బ్యాంకు ఖాతా వివరాలు ప్రధానికి పంపి, ఆ ఖాతాల్లో ఆ మొత్తం జమ చేయమని ప్రజలు డిమాండ్ చేయాలని దిగ్విజయ్ సింగ్ పిలుపునిచ్చారు.