చిన్నారి కోసం.. బెంగళూరు నుంచి చెన్నైకి చేరిన మరో చిన్నారి గుండె
బెంగళూరు/చెన్నె: బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన రెండేళ్ల బాలుడి అవయవాలను అతని తల్లిదండ్రులు దానం చేశారు. దీంతో ఆ బాలుడి గుండెను చెన్నైలో చికిత్స పొందుతున్న మరో రెండేళ్ల బాలుడికి అమర్చడం కోసం బెంగళూరు నుంచి చెన్నైకి నాలుగు గంటల్లో తరలించారు.
ఇందుకోసం రెండు రాష్ట్రాల్లోని పోలీసులు సహకరించారు. గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చెన్నైలోని ఫోర్టిన్ మలార్ ఆస్పత్రికి చేర్చారు. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రి నుంచి ఎయిర్ పోర్టు వరకు అక్కడి పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు.
చెన్నై విమానాశ్రయంలో సిద్ధంగా ఉన్న ఫోర్టిన్ ఆస్పత్రి అంబులెన్సుకు ఇక్కడి పోలీసులు సహకరించారు. రెండు రాష్ట్రాల పోలీసుల సహకారంతో గుండెను సకాలంలో ఆస్పత్రికి చేర్చారు. శుక్రవారం సాయంత్రం శస్త్ర చికిత్స చేసిన వైద్యులు, బాలుడికి గుండెను విజయవంతంగా అమర్చారు.
బ్రెయిన్ డెయిడ్ అయిన చిన్నారి తల్లిదండ్రులు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. చిన్నారి కాలేయాన్ని కూడా అవసరంలో ఉన్న మరో చిన్నారికి ఉపయోగించారు.