మోడీ పాలనపై ఢిల్లీలో బిగ్ ఈవెంట్: వ్యాఖ్యాతగా బిగ్ బి
న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్టీఏ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయింది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ రెండేళ్ల పాలనను పురస్కరించుకుని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఈనెల 28వ తేదీన ఓ మెగా ఈవెంట్ను నిర్వహించనున్నారు.
ఇండియా గేట్ వద్ద నిర్వహించే ఈ కార్యక్రమానికి సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. 'జర ముస్కు రా దో(కొంచెం నవ్వండి)' అనే పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా ఆయన మంత్రివర్గ సహచరులు హాజరవుతారు.
దూరదర్శన్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ప్రభుత్వ విజయాలు, సంక్షేమ పథకాలపై వివిధ కార్యక్రమాలపై వివిధ ప్రదర్శనలు ఉంటాయని అంటున్నారు. 28వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమై రాత్రి 10 గంటలకు పూర్తి కానుంది. చాలా రోజుల తర్వాత ఈ కార్యక్రమంలోనే ముగ్గురు ఖాన్లు ఒకేసారి కనిపించనున్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రారంభించిన స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, గ్రామీణ విద్యుదీకరణ వంటి ప్రభుత్వ పథకాలను ఈ సందర్భంగా హైలెట్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్లు అనుపమ్ ఖేర్, మధుర్ భండార్కర్, ప్రసూన్ జోషి తదితరలు హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమం మొత్తాన్ని ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. అయితే ఈ కార్యక్రమం ఒక్క ఢిల్లీలోనే కాకుండా దేశంలోని ఆరు ప్రధాన పట్టణాల్లో నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 26 నుంచి జూన్ 15 వరకు 21 రోజుల పాటు 'వికాస్ పర్వ్' పేరి ట బీజేపీ విజయోత్సవాలను నిర్వహించనుంది.
ప్రభుత్వ విజయాలను హైలైట్ చేసేందుకు దేశవ్యాప్తంగా 200 కేంద్రాలను ప్రభుత్వం గుర్తించింది. 33 టీమ్లు 6 నుంచి 7 కేంద్రాలకు వెళ్లి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటాయి.