చెంపదెబ్బ: గోవిందా క్షమాపణ చెప్పాలంటూ ఆదేశం
ముంబై: 2008లో బాలీవుడ్ నటుడు గోవిందా, చెంప చెళ్లు మనిపించిన కేసు తీర్పును సుప్రీం కోర్టు వెల్లడించింది. బాధితుడు సంతోష్ రాయ్కు క్షమాపణలు చెప్పాలంటూ గోవిందాను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే, 2008లో ముంబైలోని ఫిల్మిస్థాన్ స్టూడియోస్లో 'మనీ హైతో హానీ హై' అనే సినిమా షూటింగ్ సందర్భంగా సంతోష్ రాయ్ అనే వ్యక్తి చెంపను గోవిందా చెళ్లుమనిపించిన సంగతి తెలిసిందే.
దీంతో, గోవిందా తనకు క్షమాపణ చెప్పలని డిమాండ్ చేస్తూ సంతోష్ రాయ్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, ఘటన జరిగిన ఏడాది తర్వాత కేసు నమోదు చేశాడన్న కారణంతో 2013లో హైకోర్టు ఈ కేసును కొట్టి వేసింది.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే తాను రూ.5 నుంచి 6 లక్షలను ఖర్చు చేశానని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకు వచ్చాడు. ఈ క్రమంలో, సుప్రీంకోర్టు సంతోష్ రాయ్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. సంతోష్ రాయ్కు క్షమాపణలు చెప్పాలంటూ బాలీవుడ్ నటుడు గోవిందాకు ఆదేశాలు జారీ చేసింది.