తల్లి నగ్న చిత్రాల పేరుతో కూతురిని వెంటాడిన కామాంధుడు.. విద్యార్థిని బలవన్మరణం
ఓ కామాంధుడు నిత్యం వెంటాడటంతో భయపడిన ఓ యువతి(21) ఉరి వేసుకుని బలవన్మరణం పాలైన ఉదంతమిది.
బెంగళూరు: 'మీ అమ్మ నగ్న చిత్రాలు, వీడియోలు నా దగ్గరున్నాయి. నా మాట వినికపోతే వాటిని సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో అప్ లోడ్ చేస్తాను. నాకు లక్ష రూపాయలు తెచ్చివ్వు..' అంటూ ఓ కామాంధుడు నిత్యం వెంటాడటంతో భయపడిన ఓ యువతి(21) ఉరి వేసుకుని బలవన్మరణం పాలైంది.
ఆమెను బెదిరించిన మైసూరు సమీపంలోని బన్నూరుకు చెందిన నిందితుడు రవి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బన్నూరు పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బాధిత యువతి, నిందితుడు ఒకే ప్రాంతానికి చెందిన వారు. తండ్రి చనిపోయిన తరువాత తల్లి సంరక్షణలో ఉంటూ ప్రతిరోజూ ఆమె కళాశాలకు వెళ్లి వచ్చేది. త్వరగా చదువు పూర్తి చేసి, ఏదైనా ఉద్యోగం సంపాదించి తల్లికి అండగా నిలబడాలని కోరుకుంది.
అయితే 'నువ్వంటే నాకిష్టం.. నన్ను ప్రేమించు..'అంటూ ఆమెను రవి వెంటాడే వాడు. ఆపైన అతడు చెప్పినట్లు వినాలని హెచ్చరించేవాడు. రూ.లక్ష తీసుకొచ్చి ఇవ్వమంటూ బెదిరించేవాడు. లేదంటే ఆ యువతి తల్లికి సంబంధించిన నగ్న చిత్రాలను బహిర్గతం చేస్తానంటూ హెచ్చరించేవాడు.
ఈ కామాంధుడి నుంచి సదరు యువతి తప్పించుకుని తిరుగుతుండడంతో గత మంగళవారం రవి నేరుగా ఆమె చదువుతున్న కళాశాలకు వెళ్లాడు. ఆమెను ఆమె స్నేహితురాళ్ల ఎదురుగా బెదిరించి అవమానించాడు. దీంతో బాధితురాలు బుధ, గురువారాలు కళాశాలకు కూడా వెళ్లలేదు. వేధింపులు తీవ్రం కావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె గురువారం అర్థరాత్రి సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.