ఢిల్లీలో దారుణం: లిఫ్ట్ ఇచ్చి దారిలో మహిళపై రేప్
ఓ విందుకు హాజరై ఇంటికి తిరిగి వెళ్తున్న మహిళకు లిఫ్ట్ ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశారు. ఆమె మిత్రులు, కజిన్స్ ఇచ్చిన విందుకు హాజరై వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ: ఈశాన్య భారతదేశానికి చెందిన ఓ మహిళపై ఓ వ్యక్తి ఢిల్లీలోని హౌజ్ ఖాస్ గ్రామంలో ఆదివారం ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. మణిపూర్కు చెందిన ఆ మహిళపై శనివారం రాత్రి ఆ అఘాయిత్యం జరిగింది. తన మిత్రులు, కజిన్స్తో కలిసి హౌజ్ ఖాస్ గ్రామంలో జరిగిన విందుకు హాజరై తిరిగి వెళ్తుండగా మహిళకు ఆ దారుణం ఎదురైంది.
ఓ గుర్తు తెలియని వ్యక్తి తన వద్దకు వచ్చి లిఫ్ట్ ఇస్తానని చెప్పి రాత్రి పదకొండున్నర ప్రాంతంలో తన వెంట తీసుకుని వెళ్లాడని, జింకల పార్కు వద్ద వాహనం నిలిపి ఉంచినట్లు చెప్పాడని, తనను అక్కడికి తీసుకుని వెళ్తున్నట్లు నటించి నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లాడని ఆ మహిళ పోలీసులకు చెప్పింది.
పార్కుకు పక్కన గల నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. సంఘటన స్థలం నుంచి తప్పించుకుని వచ్చిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నామని, నిందితుడిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు.
కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలను రాబట్టామని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. మహిళతో టచ్లో ఉన్నామని, ఆందోళన నుంచి బయటపడడానికి కౌన్సెలింగ్ చేస్తున్నామని అన్నారు.