మిత్రుడి పనే: షాపింగ్ మాల్ వాష్రూంలో యువతిపై రేప్
నోయిడా: నోయిడాలో దిగ్బ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. నోయిడాలోని ఓ షాపింగ్ మాల్ వాష్రూంలో 26 ఏళ్ల స్నేహితురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారంనాడు చోటు చేసుకుంది. బాధితురాలు ఢిల్లీలోని బదర్పూరా వాస్తవ్యురాలు. యోగేష్ కుమార్ అనే మిత్రుడు తనపై అత్యాచారం చేశాడని ఆమె సాకేత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నిందితుడు ఢిల్లీలోని జైత్పూర్కు చెందినవాడు. బాధితురాలిని మెడికో లీగల్ పరీక్షకు పంపించినట్లు, ఆ తర్వాత నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నోయిడాకు చెందింది కావడంతో దాన్ని తదుపరి దర్యాప్తు కోసం సెక్టార్ 39 పోలీసు స్టేషన్కు బదిలీ చేశారు .
బాధితురాలు న్యాయ శాస్త్ర విద్యార్థి, ఏడాది కాలంగా నిందితుడితో ఆమె సహజీవనం చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో వారిద్దరు విడిపోయారు. తనను గ్రేట్ ఇండియా ప్లేస్ మాల్కు రావాల్సిందిగా నిందితుడు శనివారంనాడు పిలిచాడని, మాల్లో వాష్ రూంలో తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది.
మాల్ సిసిటీవి ఫుటేజీలను తనిఖీ చేస్తామని పోలీసులు చెబుతున్నారు శనివారంనాడు మాల్ విపరీతమైన రద్దీతో ఉంటుంది. పైగా, ఎంతో మంది సెక్యూరిటీ గార్డులు ఉంటారు. అయినప్పటికీ ఆ సంఘటన బయటకు రాకపోడం కొంత ఆశ్చర్యకరమైన విషయమే. బాధితురాలి వాంగ్మూలాన్ని పరిశీలిస్తామని, సెక్యూరిటీ గార్డుల వాంగ్మూలాలు కూడా తీసుకుంటామని పోలీసులు అంటున్నారు.