బెంగుళూరులో దారుణం: కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్..
మార్చి26 అర్థరాత్రి ఓ కదులుతున్న కారులో తెల్లవారుజాము 5గం. వరకు నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
బెంగళూరు: ఉద్యోగ నిమిత్తం పశ్చిమ బెంగాల్ నుంచి బెంగుళూరు వచ్చిన ఓ మహిళ అత్యాచారానికి గురైంది. ఓ కారు డ్రైవర్ సహా మరో ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మార్చి 26, అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బెంగుళూరులోని కోరమంగళ పోలీస్ స్టేషన్ లో ఏప్రిల్ 11న బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. మార్చి26 అర్థరాత్రి ఓ కదులుతున్న కారులో తెల్లవారుజాము 5గం. వరకు నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
నిందితులు రాజేష్, రాకేశ్, నరసింహమూర్తిగా వారి పేర్లు కూడా ఫిర్యాదులో పేర్కొంది. అయితే కారు డ్రైవర్ పేరు మాత్రం ఇంతవరకు గుర్తించలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కోరమంగళ పోలీసులు ఐపీసీ సెక్షన్-376డీ(గ్యాంగ్ రేప్) కింద కేసు నమోదు చేసి.. నిందితుల కోసం గాలిస్తున్నారు.
బాధితురాలు తెలిపిన మరిన్ని వివరాలు పరిశీలిస్తే.. పశ్చిమ బెంగాల్ నుంచి 2016మధ్యలో తాను బెంగుళూరు వచ్చినట్లు తెలిపింది. అప్పటికే తాను విడాకులు తీసుకుని ఐదేళ్లయిందని పేర్కొంది. బెంగుళూరులోని పలు ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్న సమయంలోనే రాజేశ్, రాకేశ్, నరసింహమూర్తిలతో పరిచయం ఏర్పడినట్లు చెప్పింది. అయితే ఆ పేర్లు కూడా వారి అసలు పేర్లో, కాదో అని బాధితురాలు పేర్కొనడం గమనార్హం.
అయితే ఆ ముగ్గురు వ్యక్తులతో కలిసి తాను లేట్ నైట్ పార్టీలకు వెళ్లేదానిని అని, తనపై లైంగిక దాడి జరిగిన మార్చి 26వ తేదీ, వారు ముగ్గురు కోరమంగళలోని ఓ పబ్ దగ్గర తనను కలిశారని బాధితురాలు తెలిపింది. అనంతరం అర్థరాత్రి సమయంలో క్యాబ్ లో అక్కడినుంచి వెళ్లిపోయామని, మధ్యలో లిక్కర్ కొనుగోలు చేశామని, ఆపై డ్రైవర్ సహా ఆ ముగ్గురు కలిసి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం బాధితురాలు తిరిగి బెంగాల్ వెళ్లిపోగా.. విచారణ నిమిత్తం బెంగుళూరు రావాల్సిందిగా పోలీసులు ఆమెను కోరుతున్నారు. అయితే ప్రస్తుతం తాను డిప్రెషన్ లో ఉన్నానని, ఓ డాక్టర్ వద్ద ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని, పూర్తిగా కోలుకున్న తర్వాతే బెంగుళూరు వచ్చి విచారణకు సహకరిస్తానని బాధితురాలు తెలియజేసింది.