మోదీకి అసోం మస్కట్: రేపటికి ఎన్డీయే సర్కార్ మూడేండ్లు
గౌహతి: కేంద్రంలో నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం కొలువుదీరి మూడేళ్లయింది. బీజీపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం మూడో వార్షికోత్సవ వేడుకలను ప్రధాని మోదీ శుక్రవారం అసోంలో జరుపుకోనున్నారు. దేశంలోకెల్లా పొడవైన ధోలా - సాదియా వంతెనను జాతికి అంకితం చేయనున్నారు. అలాగే అసోంలో 'భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ' భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతోపాటు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
తద్వారా తమ ప్రభుత్వం ఈశాన్య భారతం అందునా అసోం ప్రగతికి ఎంత నిబద్ధతతో ఉన్నదో జాతికి తెలియజేయాలన్న సంకల్పంతో ప్రధాని మోదీ ఉన్నారు. అసోంలోని ధోలా వద్ద 'ధోలా - సదియా' వంతెనను జాతికి అంకితం చేస్తారు. ఇది 9.15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అసోం - అరుణాచల్ప్రదేశ్ మధ్య వారధిగా ఉండే ఈ వంతెన ఈశాన్య ప్రాంత రాష్ట్రాలను కలిపేస్తుంది.
ఈశాన్యంలో రైతులు, వ్యవసాయానికి మేలు
ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఈ నెల 17వ తేదీన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ.. అసోంలో భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్ఐ) భవనం నిర్మాణానికి అంగీకారం తెలిపింది. ఇందుకోసం అసోం రాష్ట్ర ప్రభుత్వం 587 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ సంస్థ నిర్మాణంతో ఈశాన్య భారత రాష్ట్రాల్లోని రైతులు, వ్యవసాయానికి లబ్ధి చేకూరుతుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి
లోక్సభకు 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు మొదలు అదే ఏడాది మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం కొనసాగింది. కానీ 2015 ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ప్రధాని మోదీ ప్రభంజనానికి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ అడ్డుకట్ట వేసింది. 70 అసెంబ్లీ స్థానాలకు 67 నియోజకవర్గాల్లో సంచలన విజయం సాధించింది ఆప్. ప్రధాని మోదీకి ఇది వ్యక్తిగత ఓటమి అని విపక్షాలు ఆరోపించాయి. 2015 డిసెంబర్లో బీజేపీకి, ప్రధాని మోదీకి రెండో అవమానకరమైన ఓటమి ఎదురైంది. మలిదఫా ఓటమి బీహార్ నుంచి వచ్చింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో యునైటెడ్ జనతాదళ్, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల కూటమి చేతిలో బీజేపీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోనే బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి బీహార్ ఎన్నికల్లో పోటీ చేసింది మరి. దీంతో బీజేపీ నిరాశకు గురైంది.
అసోం లక్కీ మస్కట్ ఇలా
ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశానిస్ప్రుహలో కూరుకునిపోయిన బీజేపీకి, ప్రధాని నరేంద్రమోదీకి 2016 మే 18వ తేదీ కొత్త టర్నింగ్ పాయింట్ను ఇచ్చాయి. అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలుపొందడమే దీనికి కారణం. తరుణ్ గొగోయ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 15 ఏళ్లుగా నిరాటంకంగా పాలన సాగిస్తున్న అసోంలో బీజేపీ విజయం సాధించడం ఆసక్తికరంగా మారింది. ఏడాది పాటు ఓటమితో ఇబ్బందుల పాలవుతున్న మోదీకి అసోం అసెంబ్లీ ఎన్నికలు ఉపశమనం ఇచ్చాయి. అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని మోదీ, బీజేపీకి తిరుగులేకుండా పోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో నాలుగింట మూడొంతుల మెజారిటీ సాధించారు.
అసోం తర్వాత దూసుకెళ్తున్న బీజేపీ
అసోం అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఒడిశా స్థానిక సంస్థలు, పశ్చిమ బెంగాల్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాలు సాధించింది. కేవలం పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మాత్రమే పెద్దగా విజయాలు సాధించలేకపోయింది. ఎన్డీయే మూడో వార్షికోత్సవ వేడుకలను నిర్వహణకు ప్రధాని మోదీ అసోంని ఎంచుకున్నారు. 2015లో తొలి మోదీ ప్రభుత్వ వార్షికోత్సవాన్ని దీన్ దయాళ్ ఉపాధ్యయ పుట్టిన గ్రామం మథురలోని నాగ్లా చంద్రభాన్ గ్రామాన్ని సందర్శించారు. రెండో వార్షికోత్సవం సందర్భంగా సహరాన్ పూర్ గ్రామంలో భారీ ప్రదర్శనను ఉద్దేశించి మాట్లాడారు. ఇదిలా ఉంటే అసోంలో సర్బానంద సోనోవాల్ ప్రభుత్వం తొలి వార్షికోత్సవ వేడుకలు బుధవారం జరిగాయి. 26న కేంద్ర ప్రభుత్వ మూడో వార్షికోత్సవ వేడుకలు జరుగుతాయి.
బీజేపీ రాజకీయ కుట్ర చేస్తున్నదన్న అసోం మాజీ సీఎం
తిన్ సుకియా జిల్లాలోని ధోలా - సాదియా వంతెన ప్రారంభ వేడుకలకు అనుమతి నిరాకరించడం వెనుక కుట్ర దాగి ఉన్నదని అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ ఆరోపించారు. భద్రతా కారణాలతో తనకు అనుమతి నిరాకరించడం దేనికని ప్రశ్నించారు. సోమవారం వంతెన వద్దకు వెళ్లిన తనకు ప్రధాని రాక సందర్భంగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) అనుమతి నిరాకరించిందన్నారు. భద్రత పేరిట అనుమతి నిరాకరించడానికి తానేమీ ఉగ్రవాదిని కాదని చెప్పారు. తాము పునాది వేసిన వంతెనను ప్రారంభించి ఆ ఘనత కొట్టేయడానికి బీజేపీ రాజకీయ కుట్ర పన్నిందన్నారు. 2011లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ వంతెన నిర్మాణం ప్రారంభమైంది. తమ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన వంతెన నిర్మాణంతో భావోద్వేగం పెనవేసుకు పోయిందని అసోం మంత్రి ప్రద్యుత్ బొర్డోలోయి అన్నారు.