రేప్: హాస్టల్లోనే బాలిక ప్రసవం, శిశువు హత్య
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రాంపూర్ బ్లాక్ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో ఓ గిరిజన విద్యార్థిని ప్రసవించింది. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఆమె బంధువే ప్రసవించిన బిడ్డను చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనతో సంబంధం ఉన్న ఆరుగురు నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వార్తలను మీడియాలో చూసిన జిల్లా కలెక్టర్ రెసిడెన్షియల్ స్కూల్ సూపరింటెండెంట్ను సస్పెండ్ చేశారు. ఘటనపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. కాగా, సూపరింటెండెంట్, అతని భార్య ఘటన తర్వాత హాస్టల్ నుంచి పరారయ్యారు.
సల్గవఖుర్ద్ గ్రామానికి చెందిన బాధిత బాలిక పదవ తరగతి చదువుతోంది. ఆమె అత్యాచారానికి గురైన కారణంగా డిసెంబర్ 28న ఓ పాపకు జన్మనిచ్చింది. సూపరింటెండెంట్ బలవంతంగా బాలికను హాస్టల్ ఆవరణలోనే ప్రసవం చేయించినట్లు పోలీసులు తెలిపారు. నది సమీపంలో బాలిక ప్రసవించిన మృత శిశువును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
అనిల్ అనే యువకుడు ఆమెను అత్యాచారం చేశాడని, ఆమె శిశువును ప్రసవించడంతో శిశువును అపహరించి చంపేశాడని తెలిపారు. ఇందుకు అతని బంధువులు కూడా సహకరించారని చెప్పారు. అనిల్ తోపాటు మరో ఐదుగుర్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు అనిల్ వివాహితుడని, బాధిత బాలికకు దూరపు బంధువని పోలీసులు చెప్పారు. పలు సెక్షన్ల కింద నిందితుడిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, ఈ విషయంపై స్పందించేందుకు బాలిక కుటుంబసభ్యులు నిరాకరించారు.