ఇంటి ముందు నిద్రిస్తున్న బాలుడిపై చిరుత దాడి: విషమం
మౌ: తమ ఇంటి ముందు నిద్రిస్తున్న ఓ ఆరేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసింది. చిరుత దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాలోని సదాడియాకౌ గ్రామంలో చోటు చేసుకుంది.
ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మనావర్ పోలీసుల కథనం ప్రకారం.. అర్జున్ అనే ఆరేళ్ల బాలుడు తన ఇంటిముందు నిద్రిస్తున్నాడు. సమీపంలోని అడవి నుంచి వచ్చిన చిరుతపులి ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. బాలుడు పెద్దగా ఏడ్చాడు.
ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులు బయటికి వచ్చి పెద్దపెట్టున కేకలు వేశారు. బాలుడ్ని కొంతదూరం ఈడ్చుకెళ్లిన చిరుతపులి, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో రావడంతో అతడ్ని వదిలేసి అడవిలోకి పారిపోయింది. కాగా, అర్జున్కి తల, మెడపై తీవ్ర గాయాలయ్యాయి.
హుటాహుటిన అతడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు గ్రామానికి వెళ్లి, స్థానికులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అడవిలో చిన్న జంతువులు ఆహారంగా దొరకకపోవడంతో క్రూరమృగాలు గ్రామాల వైపు వచ్చి మేకలు, గొర్రెలు లాంటి జంతువులను చంపి తింటున్నాయని అధికారులు తెలిపారు. అదే సమయంలో మనుషులపైనా దాడులు చేస్తున్నాయని తెలిపారు. కాగా, తరచూ క్రూర మృగాలు గ్రామాలపై దాడి చేసి ప్రాణాలు తీస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.