వైద్యుల చేతివాటం: చికిత్స చేయమంటే.. కిడ్నీలు మాయం చేశారు
న్యూఢిల్లీ: వైద్య సేవలందించడంలో మంచి పేరున్న ఢిల్లీలోని ఎయిమ్స్లో కొందరు వైద్యులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఏకంగా వైద్యం కోసం వచ్చిన ఓ ఆరేళ్ల బాలిక కిడ్నీలనే మాయం చేశారు ఆ దుర్మార్గులు. బాధితురాలి తండ్రి ఘటనపై హౌజ్ ఖాస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
వివరాలిలా ఉన్నాయి.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ ప్రాంతానికి చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తి గత సంవత్సరం తన కుమార్తెను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. పాప ఎడమవైపు కిడ్నీలో సమస్యతో బాధపడుతుండటంతో ఆపరేషన్ కోసం ఎయిమ్స్కి వచ్చారు.
కాగా, ఆ కిడ్నీ తొలగించాలని వైద్యులు తెలిపారు. అయితే ఆపరేషన్ అనంతరం మళ్లీ పాప నొప్పి బాధపడుతుండగా, ఆమె తండ్రి స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు చిన్నారికి రెండు కిడ్నీలు లేవని నిర్ధారించారు.
ఈ నేపథ్యంలో బాలిక తండ్రి ఎయిమ్స్కి వెళ్లి ఆపరేషన్ చేసిన వైద్యుడిని ప్రశ్నించగా, అతను స్పందించలేదు. దీంతో పవన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై ఎయిమ్స్ సీనియర్ వైద్యులు సదరు వైద్యునిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.
తన పాపకు కుడి కిడ్నీ బాగానే ఉందని దాన్ని కూడా వైద్యులు తొలగించారని పవన్ కుమార్ తెలిపారు. ఎయిమ్స్ వైద్యులు ఆపరేషన్ చేసిన(మార్చి 14) నాటి నుంచి తన కూతురు డయాలసిస్ మీదే ఉందని చెప్పారు.