గదికి పిలిచి బంధువు దారుణం: ఏడేళ్ల బాలిక రేప్, హత్య
లక్నో: ఏడేళ్ల బాలిక పైన ఓ బంధువే అత్యాచారం, చేసి హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. సదరు బాలిక సమీప బంధువు చేతిలోనే ఈ దారుణానికి గురయింది. ఘజియాబాద్ జిల్లాలోని నందగ్రామ్ ప్రాంతంలోని వాల్మికీ అంబేడ్కర్ ఆవాస్ యోజన (వాంబే) కాలనీలో ఇది జరిగిందని పోలీసులు తెలిపారు.
వాంబే కాలనీలోనే ఉంటున్న సమీప బంధువు సుబోధ్ పిలవడంతో బాలిక శుక్రవారం సాయంత్రం ఆయన గదికి వెళ్లింది. ఎంత సేపటికి బాలిక తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఆమె కోసం వెతికారు. వారు సుబోధ్ గదికి వెళ్లారు. ఆయన గది తాళం వేసి ఉంది. దీంతో వారు వెనుదిరిగారు.
రాత్రి అంతా వేర్వేరు చోట్ల వెతికినా ఫలితం లేకపోయింది. మళ్లీ శనివారం ఉదయం సుబోధ్ గదికి వెళ్లి చూశారు. అప్పటికి కూడా తాళం వేసి ఉంది. అనుమానం వచ్చిన వారు మరో తాళం చెవితో తలుపులు తెరిచి చూశారు. అక్కడ బాలిక మృతదేహం కనిపించింది.
బాలిక పైన అత్యాచారం చేసినట్లు శవపరీక్షలో తేలింది. నిందితుడిని పట్టుకునేందుకు 2 బృందాలు ఏర్పాటు చేశారు. కాగా, తమ కూతురు పైన అఘాయిత్యానికి పాల్పడి, అత్యాచారం చేసిన సుబోధ్ను వెంటనే అరెస్టు చేయాలంటూ తల్లిదండ్రులు అతని ఇంటి ముందు ఆందోళనకు చేపట్టారు.
అయితే, వారిని పోలీసులు సముదాయించారు. నిందితుడిని సాధ్యమైనంత తొందరలో పట్టుకుంటామని వారు తల్లిదండ్రులకు నచ్చ చెప్పారు. పోలీసులు నిందితుడు పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోస్కో చట్టం, ఐపీసీ సెక్షన్ 376, 302 ప్రకారం సుబోధ్ పైన కేసు నమోదు చేసినట్లు సిహానీ గేట్ పోలీసు స్టేషన్ ఎస్ఎహ్ఓ అశోక్ సిసోడియా తెలిపారు.