'72 శాతం రేప్ నిందితులు అమ్మాయిల బాయ్ఫ్రెండ్సే'
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై అత్యాచార కేసులకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అత్యాచారం కేసుల్లోని నిందితుల్లో 71.9 శాతం మంది బాధితుల మిత్రులేనని, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి మోసం చేసినవారేనని ఈ సమీక్షలో బయటపడింది. ఈ ఏడాది అక్టోబర్ వరకు జరిగిన సంఘటనల విషయాల్లో ఆ వాస్తవం వెలుగు చూసింది.
అందుకు సంబంధించిన గణాంక వివరాలను పోలీసు శాఖ క్రోడీకరించింది. ఈ ఏడాది ముంబైలో 542 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. వాటిలో 389 (71.9 శాతం) కేసుల్లో బాధితుల బాయ్ఫ్రెండ్స్ నిందితులని, పెళ్లి చేసుకుంటామని హామీ ఇచ్చి లైంగిక సంబంధం పెట్టుకుని మోసం చేసినవారేనని ఆ వివరాలు వెల్లడించాయి. పోలీసు కమిషనర్ రాకేష్ మారియా బుధవారం ఆ విషయం చెపిపారు.
ఆరు శాతం అత్యాచారం కేసుల్లో మాత్రమే గుర్తు తెలియని వ్యక్తులు నిందితులని, మిగతా అన్ని కేసుల్లో బంధువులు గానీ సమీప రక్తసంబంధీకులు గానీ నిందితులుగా ఉన్నారని ఆయన చెప్పారు. ముంబైలో ఇప్పటి ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ వరకు నమోదైన 542 కేసుల్లో 477 కేసులు పరిష్కారమైనట్లు ఆయన తెలిపారు. అంతకు ముందు ఇదే కాలంలో 333 కేసులు నమోదు కాగా, 316 కేసులు పరిష్కారమైనట్లు చెప్పారు.
ఫిర్యాదులు చేయడానికి ముందుకు వచ్చేలా తాము బాధితులను ప్రోత్సహిస్తున్నామని, దాంతో లైంగిక దాడి సంఘటనల్లో ఫిర్యాదులు చేయడానికి నిర్భయంగా ముందుకు వస్తున్నారని మారియా చెప్పారు. మహిళలు ఎక్కువగా ముందుకు వస్తుండడంతో అత్యాచారం కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలిపారు. అదృశ్యానికి సంబంధించిన కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ పెడుతామని పోలీసు కమిషనర్ చెప్పారు.