జయలలిత ఎప్పుడు? ఎలా చనిపోయింది?: జవాబు లేని 8ప్రశ్నలివి
జయలలిత మరణంపై తమిళ ప్రజల్లోనే రాజకీయ నేతల్లో కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చెన్నై: సెప్టెంబర్ 22న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5న రాత్రి 11గంటల ప్రాంతంలో కన్ను మూసిన విషయం తెలిసిందే. అయితే ఆమె మరణంపై తమిళ ప్రజల్లోనే రాజకీయ నేతల్లో కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, జయ మృతిపై తమకు అనుమానాలున్నాయంటూ ప్రముఖ నటి గౌతమి.. ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ కూడా రాశారు.
ఇలా చాలా మందికి జయ మృతిపై అనేక అనుమానాలున్నాయి. ముఖ్యంగా ఎనిమిది ప్రశ్నలపై ప్రజల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఆమెకు స్లో పాయిజన్ ఇచ్చారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమివ్వగలిగితేనే సందేహాలకు తొలగుతాయని చర్చించుకుంటున్నారు. ఆ ఎనిమిది ప్రశ్నలను పరిశీలించినట్లయితే...
సాధారణ అనారోగ్యం
సెప్టెంబర్ 22న జయలలిత డీహైడ్రేషన్తో బాధపడుతూ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. సరిగ్గా ఆమె ఆస్పత్రిలో చేరిన రెండో రోజు, అంటే సెప్టెంబర్ 23న అపోలో ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. జయలలిత జ్వరం, డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్నారని, ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని, అబ్జర్వేషన్లో ఉంచామనేది ఆ ప్రెస్ నోట్ సారాంశం. జ్వరం, డీహైడ్రేషన్ మాత్రమే అయితే 75రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఉందా? అనేది మొదటి ప్రశ్న.
జ్వరం తగ్గిపోయిందని..
అదే రోజు మరో ప్రెస్ నోట్ను ఆస్పత్రి విడుదల చేసింది. ఆమెకు జ్వరం తగ్గిపోయిందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని అందులో ఉంది. ఆమె సాధారణ స్థితిలోనే ఉంటే ఎందుకు ఎవర్ని ఆస్పత్రిలోకి అనుమతించలేదు?
ఎందుకిలా..
నవంబర్ 19న అన్నాడీఎంకే అధికారిక ట్విటర్ అకౌంట్లో పురుచ్చి తలైవి అమ్మను ఐసీయూ నుంచి జనరల్ వార్డ్కు తరలించారని ట్వీట్ చేశారు. జనరల్ వార్డుకు తరలించిన కొద్దిరోజులకే మళ్లీ ఆరోగ్యం ఇంతలా క్షీణించిందా? అనేది మూడో ప్రశ్న.
ఒక్క ఫొటో కూడా..
జయలలిత ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్న ఫోటో ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో హల్చల్ చేసింది. ఆ తర్వాత అది ఫేక్ అని తేలింది. 75 రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ముఖ్యమంత్రికి సంబంధించిన ఏ ఒక్క ఫోటోను కూడా విడుదల చేయకపోవడానికి కారణం ఏంటనేది నాలుగో ప్రశ్న.
చనిపోయిందంటూ..
ఓ పాపులర్ తమిళ ఛానల్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో జయలలిత చనిపోయారంటూ ట్వీట్ చేసింది. ఆ తర్వాత కొన్ని ఒత్తిళ్లకు తలొగ్గి ఆ ట్వీట్ను తొలగించింది. ఆమెకు ఏ హాని జరగకపోతే ఈ ఛానల్ చెబుతుంది అబద్ధం అని, వాస్తవమిది అని జయకు సంబంధించిన ఏ ఒక్క ఆధారాన్ని ఎందుకు చూపించలేకపోయారనేది ఐదో ప్రశ్న.
ముందే తెలుసా?
జయలలిత క్షేమంగానే ఉండి ఉంటే అన్నాడీఎంకే నేతలు ముందుగానే పన్నీరు సెల్వంను తమ ముఖ్యమంత్రిగా ఎలా నిర్ణయించి ఉంటారు? అన్నాడీఎంకే నేతలకు జయలలిత చనిపోయిన విషయం ముందే తెలుసా అనేది ఆరో ప్రశ్న.
దీపను అనుమతించలేదు
ఈ విషయాలన్నింటినీ పక్కనపెట్టినా జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ను అపోలో ఆస్పత్రిలోకి అనుమతించలేదు. అంటే జయలలిత ఏ స్థితిలో ఉందన్న విషయాన్ని సొంతవారికి కూడా తెలియకుండా రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటనేది ఏడో ప్రశ్న. ఇక్కడ మరో విషయమేంటంటే, జయలలిత మృతికి సంబంధించిన కొన్ని కీలక విషయాలను త్వరలో వెల్లడిస్తానని దీపా ప్రకటించడంతో ఏం చెబుతుందోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
ఏం జరిగిందో తెలియదు
జయలలిత చనిపోయిన విషయాన్ని 75 రోజులు అపోలో ఆస్పత్రి గోప్యంగా ఉంచింది. జయ చనిపోయిన తర్వాత ఆమె చికిత్సకు సంబంధించిన చిత్రాలను కానీ, సీసీ టీవీ పుటేజిలను కానీ విడుదల చేయడంలో అపోలో ఆస్పత్రికున్న అభ్యంతరాలేంటనేది ఎనిమిదో ప్రశ్న. అయితే, ఇది ఆస్పత్రి నిర్ణయమా? లేక ప్రభుత్వ నిర్ణయా? అనేది తెలియాల్సి ఉంది. అయితే, సీసీ టీవీ ఫుటేజిలను విడుదల చేస్తే ప్రజల్లో ఉన్న సందేహాల తొలిగిపోయే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక, మృతి చెందిన తర్వాత జయలలిత చెంపపై ఉన్న రంధ్రాలు కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది.