ఘోర ప్రమాదం: బస్సులో మంటలు, 9మంది సజీవ దహనం
అమేథీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బస్సులో మంటలు చెలరేగడంతో బస్సులోని 9మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన అమేథీ జిల్లాలోని పీపరాపూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి హుటాహుటిని తరలించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పేశాయి.
మంగళవారం ఉదయం ప్రయాణికులతో బస్సు సుల్తాన్ పూర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. రాంగాన్ గ్రామ సమీపంలోకి రాగానే షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సు ఇంజిన్లో మంటలు చెలరేగినట్లు చెప్పారు. ఆ సమయంలో బస్సులో 42మంది ప్రయాణికులు ఉన్నారు.
మంటలు చెలరేగటంతో కొంతమంది ప్రయాణికులు బస్సు అద్దాలు పగులగొట్టి ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సుల్తాన్ పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. మృతి చెందినవారి వివరాలను సేకరిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.