ఢిల్లీ మెట్రో రైలు జేబు దొంగల్లో 94 శాతం మంది మహిళలే.. డేటా విడుదల..!
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో పోలీసులకు చిక్కిన జేబు దొంగల్లో 94 శాతం మహిళేనని అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం గత జనవరి నుంచి నవంబర్ వరకు 11నెలలకు సంబంధించిన డేటాను విడుదల చేసింది.
ఢిల్లీ మెట్రో పరిధిలోని 134 రైల్వే స్టేషన్లలో భద్రతను పర్యవేక్షిస్తున్న సీఐఎస్ఎఫ్ జవాన్లు అరెస్ట్ చేసిన జేబు దొంగల్లో 293 మంది మహిళలు కాగా పురుషులు 22 మంది ఉన్నారు. ఢిల్లీ మెట్రో ర్వైల్వే స్టేషన్లలో మహిళలే ఎక్కువగా దొంగతనాలు చేస్తున్నారట.
చంటి పిల్లాడిని చంకలో వేసుకుని మహిళలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తారని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా చంటిపిల్లలతో కనిపించే మహిళల పట్ల దొంగతనానికి సంబంధించిన అనుమానాలు కలగవు కదా. అందుకే, దీనినే ఆసరాగా చేసుకుని సదరు మహిళలు జేబు దొంగతనాల్లో పురుషులను మించిపోయారని అన్నారు.
గత ఏడాది ఢిల్లీ మెట్రో పరిధిలోని స్టేషన్లలో 466 మంది జేబుదొంగలను అరెస్టు చేయగా... అందులో 421 మంది మహిళలేనని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 29 లక్షలను డబ్బు రూపేణ, 9 కోట్ల రూపాయలను చెక్కుల రూపేణ రికవరీ చేశామని తెలిపారు. దీంతో ఢిల్లీ మెట్రో రైలెక్కే ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించే మహిళల పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.