లేడీ బిపివోపై రేప్: మంత్రి వివాదాస్పద వ్యాఖ్య
బెంగళూరు: కర్ణాటక హోం శాఖ మంత్రి కే.జే. జార్జ్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు కలిసి మహిళ మీద రేప్ చేస్తే అది అత్యాచారం అవుతుందని, గ్యాంగ్ రేప్ కాదని మీడియాకు చెప్పడంతో దూమరం చెలరేగింది. శుక్రవారం కే.జే. జార్జ్ విలేకరులతో మాట్లాడారు.
బెంగళూరు నగరంలో 22 సంవత్సరాల బీపీఓ కంపెనీ ఉద్యోగినిపై ఇద్దరు అత్యాచారం చేసిన కేసు విషయంపై మాట్లాడారు. ముగ్గురు లేక నలుగురి కంటే ఎక్కువ మంది మహిళపై అత్యాచారం చేస్తే అది గ్యాంగ్ రేప్ అవుతుందని అన్నారు.
అంతేగానీ ఒకరు, ఇద్దరు రేప్ చేస్తే గ్యాంగ్ రేప్ కాదని చెప్పారు. బీపీఓ ఉద్యోగినిపై అత్యాచారం చేసిన సునీల్ ఓంకారప్ప (23), యోగేష్ మల్లేషప్ప (27) అనే ఇద్దరు కామాంధులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారని జార్జ్ వివరించారు.
వీరిద్దరు చిక్కమగళూరు జిల్లాలోని కడూరు ప్రాంతానికి చెందినవారని, గత మూడు సంవత్సరాలుగా బెంగళూరులో డ్రైవర్లుగా పని చేస్తున్నారని జార్జ్ అన్నారు. జార్జ్ చేసిన వ్యాఖ్యలతో పలు మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.