బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై ఉగ్ర దాడి (వీడియో)
కాశ్మీర్: జమ్మూ-కాశ్మీర్ లో బీఎస్ఎఫ్ జవాన్ల కాన్వాయ్ మీద ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులు దాడి చెయ్యడంతో ఒక జవాను వీరమరణం పొందాడు. బీఎస్ఎఫ్ జవాన్ల ఎదురు కాల్పులలో ఒక ఉగ్రవాది అంతం అయ్యాడని అధికారులు తెలిపారు.
జమ్మూ-కాశ్మీర్ జాతీయ రహదారిలోని ఉదామ్ పూర్ ప్రాంతంలో బుధవారం ఉదయం అమరనాథ యాత్ర భక్తులు బయలుదేరారు. భక్తులు బయలుదేరిన కొన్ని నిమిషాలకే ఉగ్రవాదులు తుపాకులతో ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపారు.
క్షణాలలో తేరుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు. జాతీయ రహదారిలో వాహన సంచారాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఈ దాడిలో ఆరు మంది జవాన్లు గాయపడ్డారు. అమరనాథ యాత్రికులను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేశారని అధికారులు అన్నారు.
అమరనాథ యాత్ర భక్తుల మీద ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు కొన్ని రోజుల క్రితం హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇదే సందర్బంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.