గవర్నర్ను పంపించండి: సుప్రీంలో అర్జీ
న్యూఢిల్లీ: సంచలనం కలిగించిన వ్యాపం స్కాం కుంభకోణంతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కుంటున్న మధ్యప్రదేశ్ గవర్నర్ రాం నరేష్ యాదవ్ ను వెంటనే ఆ పదవి నుండి తప్పించాలని అక్కడి ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటీషన్ వేసింది.
కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే వెంటనే రాం నరేష్ యాదవ్ ను తప్పించాలని మనవి చేసింది. ఈ అర్జీని విచారించడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. అనేక ఆరోపణలు ఎదుర్కోంటున్న రాం నరేష్ యాదవ్ ను పదవి నుండి తప్పుకోవాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఆయన కుర్చిని అంటి పెట్టకుని అక్కడే మకాం వేశారు. ఈ సందర్బంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్వయంగా సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో రాం నరేష్ యాదవ్ ఇరకాటంలో పడ్డారు. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్వహించిన పరీక్షలు, ఉద్యోగ నియమకాలలో భారీ గోల్ మాల్ జరిగింది.
ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడు గవర్నర్ రాం నరేష్ యాదవ్ కుమారుడు శైలేష్ యాదవ్. అయితే గత మార్చి నెలలో శైలేష్ యాదవ్ అనుమానస్పద స్థితిలో మరణించాడు. ఈ కుంభకోణంలో గవర్నర్ రాం నరేష్ యాదవ్ పాత్ర ఉందని దర్యాప్తు సంస్థ సిట్ గుర్తించింది.
హైకోర్టు అనుమతితో ఎఫ్ఐఆర్ లో గవర్నర్ పేరును చేర్చింది. ఇప్పటి వరకు ఈ కేసులో దాదాపు రెండు వేల మంది అరెస్టు అయ్యారు. ఇంకా 800 మందికి పైగా నిందితులు ఉన్నారని సిట్ అధికారులు చెప్పారు. వారిని త్వరలో అరెస్టు చెయ్యడానికి రంగం సిద్దం అయ్యింది. ఇదే సమయంలో నిందితులు, సాక్షులు ఒక్కోక్కరే అనుమానాస్పద స్థితిలో మరణిస్తున్నారు.