దొంగ బాబా దుమ్ము లేపేశారు: కార్లకు నిప్పు
భువనేశ్వర్: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్థించి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న దొంగ బాబాకు స్థానికులు దేహశుద్ధి చేశారు. బాబాతో పాటు ఆయన అక్రమాలకు సహకరిస్తున్న ఇద్దరు కుమారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఒడిశాలోని భువనేశ్వర్ ఎస్పీ ఆర్.పీ. శర్మా కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భువనేశ్వర్ శివార్లలో ని గ్రామంలో సురేంద్ర మిశ్రా అలియాస్ సురా బాబా ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమానికి ఒడిశాలోని పలు ప్రాంతాల నుండి మహిళలు వస్తుంటారు.
బాబాను దేవుడితో సమానంగా చూస్తున్నారు. అయితే ఆశ్రమానికి వస్తున్న మహిళల పట్ల సురా బాబా అసభ్యంగా ప్రవర్థిస్తున్నాడని, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. మహిళలు సమాచారం ఇవ్వడంతో ఆదివారం రాత్రి వందలాధి మంది ఆశ్రమంలోకి వెళ్లారు.
ఆశ్రమంపై దాడి చేసి అక్కడ ఉన్న సామాగ్రిని ధ్వంసం చేశారు. ఆశ్రమం ఆవరణంలోని కార్లు, పలు వాహనాలకు నిప్పంటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు బెటాలియన్ల సాయుధ బలగాలను రంగంలోకి దింపారు.
స్థానికులకు నచ్చ చెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చామని ఎస్పీ ఆర్.పీ. శర్మ తెలిపారు. పోలీసులు ఆందోళనకారులతో పాటు సురా బాబా మీద కేసులు నమోదు చేశారు. సురేంద్ర మిశ్రా తాను దేవదూతనంటూ తనను తానే ఆధ్యాత్మిక దేవుడిగా ప్రకటించుకున్నారు.
అంతే కాకుండ స్థలాలు ఆక్రమించుకుని అక్రమంగా ఆశ్రమం నిర్మించుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు సురా బాబా శ్రుతి మించి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్థిస్తున్నాడని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆశ్రమం దగ్గర గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.
పోలీసులు సురా బాబా, ఆయన ఇద్దరు కుమారులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గతంలో సారథి బాబా మీద ఇలాంటి ఆరోపణలు రావడంతో స్థానికులు ఆయన మీద దాడులు చేసి పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు సురా బాబా వంతు వచ్చింది.