కదిలే రైలు నుంచి మహిళను తోసేసిన రైల్వే అధికారి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కదిలే రైలు నుంచి ఓ మహిళను రైల్వే అధికారి తోసేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. బీహార్కు చెందిన వందన అనే మహిళ కుటుంబసభ్యులతో కలిసి హౌరా-ముంబై రైలులో ప్రయాణిస్తోంది. అయితే వారు జనరల్ టికెట్ తీసుకుని రిజర్వేషన్ బోగీలో కూర్చున్నారు.
కాగా, అక్కడికి వచ్చిన రైల్వే అధికారి వారిని అదనంగా డబ్బులు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. దీంతో వందన ఆ రైల్వే అధికారితో వాగ్వాదానికి దిగింది. ఆగ్రహానికి గురైన సదరు అధికారి ఆమెను కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేశాడు. దీంతో ఆమె కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వే అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు.