కేజ్రీవాల్తో ప్లేటు భోజనం రూ. 20 వేలు, 'బ్రాండ్ మోడీ'ని ఎదుర్కొనేందుకే..!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏది చేసినా అందులో వైవిధ్యం. త్వరలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తుండటంతో నిధుల సేకరణ కోసం 'విందు' ఇచ్చారు. ప్రముఖులకు విందు పార్టీ ఇచ్చి వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున విరాశాలు సేకరించారు.
నిధుల సేకరణ కోసం నిన్న రాత్రి అరవింద్ కేజ్రీవాల్ ముంబైలో వజ్రాల వ్యాపారులు, బ్యాంకర్లు, ఇతర ప్రముఖులకు విందు ఇచ్చారు. ఈ విందులో పాల్గొన్నవారు ప్లేటు భోజనానికి రూ. 20 వేలు చెల్లించారు.
దీని ద్వారా మొత్తం 91 లక్షలు రూపాయలు సేకరించారు. ఇందులో రూ. 36 లక్షలు పాస్లు, మరో రూ. 36 లక్షలు చెక్ల రూపంలో, రూ. 21 లక్షలు వాలంటీర్లు ద్వారా నగదు వసూలైంది. త్వరలో బెంగుళూరులో మరో నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ ప్రీతి శర్మ మీనన్ పేర్కొన్నారు.
'బ్రాండ్ మోడీ'ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ముంబైలో విందులో 200 మంది పాల్గొన్నారు. వీరిలో ఎక్కువ భాగం ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులు, ఉత్సాహావంతులైన యువకులు, వజ్రాల వ్యాపారులతో పాటు బాలీవుడ్కు చెందిన పలువురు డైరెక్టర్లు పాల్గొన్నట్లు ఆమె చెప్పారు.
రాబోయే కొన్ని రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మహారాష్ట్ర యూనిట్ రూ. 5 కోట్లు నిధుల సేకరించేందుకు ప్రణాళికలు రచించామన్నారు. ఐతే అరవింద్ కేజ్రీవాల్ ఇలా ప్లేటు భోజనానికి రూ. 20000 వసూలు చేయడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
ఐతే ఈ నిధుల సేకరణ మాకోసం కాదని, పార్టీ కోసమేనని అరవిందే కేజ్రీవాల్ స్పష్టం చేశారని ఆమె పేర్కొన్నారు. నిధులు ఇచ్చిన వారి పేర్లను ఆమ్ ఆద్మీ పార్టీ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తున్నట్లు చెప్పారు.