షాక్: బిజెపిలో చేరిన ఆప్ ఎమ్మెల్యే వేద్ ప్రకాష్, 35 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి
మున్సిఫల్ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వేద్ ప్రకాష్ సతీష్ పార్టీకి రాజీనామా చేసి సోమవారం నాడు బిజెపిలో చేరారు.
ఢిల్లీ: మున్సిఫల్ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వేద్ ప్రకాష్ సతీష్ పార్టీకి రాజీనామా చేసి సోమవారం నాడు బిజెపిలో చేరారు.
బిజెపి ఢిల్లీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఆధ్వర్యంలో వేద్ ప్రకాష్ బిజెపిలో చేరారు. 2015 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయడంలో ఆప్ వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు.
ఈ కారణంగానే తాను ఆప్ ను వదిలి బిజెపిలో చేరుతున్నట్టుగా ఆయన ప్రకటించారు.భావనా అసెంబ్లీ స్థానం నుండి ఆయన ప్రాతినిథ్యం వహించారు.అయితే ఎమ్మెల్యే పదవికి కూడ తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
మరో వైపు పార్టీలోని అన్ని పదవుల నుండి తాను తప్పుకొంటున్నట్టు ఆయన చెప్పారు.స్పీకర్ కు తన రాజీనామా లేఖను అందించనున్నట్టు ఆయన తెలిపారు.
పార్టీలో దాదాపుగా 35 మంది ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారని ఆయన చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలకు పార్టీ ఇచ్చిన హమీలను నెరవేర్చడం లేదని వేద్ ప్రకాష్ మీడియాకు వివరించారు.
ఇప్పటికే దేవేంద్ర షెకావత్, పంకజ్ పుష్కరం, సందీప్ కుమార్ లు పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ఆయన చెప్పారు.