ఆప్ జాతీయ కార్యవర్గం నుంచి యోగేంద్ర, ప్రశాంత్ ఔట్
న్యూఢిల్లీ: పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ను సవాల్ చేసిన ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కార్యవర్గం నుంచి బహిష్కరించారు. దీంతో వారు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడం ఖాయమైంది. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని యోగేంద్ర యాదవ్ అన్నారు.
దానికి ముందు జరిగిన దాదాపు రెండు గంటల పాటు సమావేశంలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఉద్వేగపూరితమైన ప్రసంగం చేసినట్లు తెలుస్తోంది. ఎనిమిది మంది తన మద్దతుదారులతో యోగేంద్ర యాదవ్ సమావేశం వేదిక వెలుపల నిరసనగా బైఠాయించారు. సమావేశంలో వ్యవహారాలు పారదర్శకంగా జరగాలని తాను నిరసన వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు.
యాదవ్ ఒంటరివాడైనట్లు కనిపించారు. ఆప్ కార్యకర్తలు కేజ్రీవాల్కు మద్దతుగా పెద్ద యెత్తున రోడ్లను అడ్డగించి, నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఆ ప్రాంతంలో భద్రతా బలగాలను మోహరించారు. తాను యాదవ్తో గానీ భూషణ్తో గానీ పనచేయలేనని సమావేశంలో కేజ్రీవాల్ స్పష్టం చేసినట్లు సమాచారం.
శుక్రవారంనాడు రహస్యంగా చిత్రీకరించిన ఫోన్ సంభాషణలను లీక్ చేశారు. యోగేంద్ర యాదవ్ను, ప్రశాంత్ భూషణ్ను కేజ్రీవాల్ దూషించిన సంభాషణలు అందులో ఉన్నాయి. యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్లో గత పది రోజులుగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్లతో లోకసభ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైన తర్వాత విభేదాలు పొడసూపాయి. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన తర్వాత ఆ విభేదాలు మరింత పెరిగాయి.