ఆయనొక నియంత: కేజ్రివాల్పై యోగేంద్ర, భూషణ్, వేటు తప్పదేమో!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై ఆప్ అసమ్మతి నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. అరవింద్ కేజ్రివాల్పై తీవ్ర విమర్శలు చేశారు.
కేజ్రీవాల్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్వరాజ్య పార్టీ అని చెప్పుకుంటున్న పార్టీలో స్వరాజ్యం ఉందా? అని వారు ప్రశ్నించారు. తనను ప్రశ్నించేవారిని కేజ్రీవాల్ సహించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య మానవుడికి అధికారం, అవినీతి నిర్మూలన లాంటి సదుద్దేశాలతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని పేర్కొన్నారు.
తమ పార్టీమీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలు సామాన్యుడికి అధికారాన్ని కట్టబెట్టారన్నారు. అలాంటి పార్టీ ఆశయాలను నీరుగార్చే ప్రయత్నాలను సహించమని, పార్టీని రక్షించుకోవడానికి పోరాడతామన్నారు. కేజ్రీవాల్ను జాతీయ కన్వీనర్గా రాజీనామా చేయాలని తాము కోరలేదని మరోసారి వారు స్పష్టం చేశారు.
తాము పదవి, అధికారం, సాయం కోరడం లేదని తేల్చి చెప్పారు. పార్టీలో ప్రజాస్వామ్యానికి సంబంధించి తమ డిమాండ్లను తీరిస్తే పార్టీకి రాజీనామా చేస్తామని తెలిపారు. కాగా, పార్టీకి వ్యతిరేకి, అధినేతకి వ్యతిరేకింగా వ్యవహరిస్తున్న యోగేంద్ర, భూషణ్లపై వేటు వేసే యోచన చేస్తోంది ఆప్ అధిష్టానం.