కేజ్రీవాల్కు దెబ్బ మీద దెబ్బ.. రూ.2 కోట్ల విరాళాల లెక్క చెప్పాలన్న ఐటీ
వరుస సమస్యలతో ‘ఆప్’ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. మరోవైపు ఆ పార్టీ విశ్వసనీయత కూడా దెబ్బతింటోంది.
న్యూఢిల్లీ: అసలే చిక్కుల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మరో ఇరకాటం వచ్చి పడింది. కపిల్ మిశ్రా కారణంగా 'ఆప్'లో అంతర్యుద్ధం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పులి మీద పుట్రలా 2015 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన రూ.2 కోట్ల విరాళాల లెక్కను తెలియజేయాల్సిందిగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఆ విరాళాలకు సంబంధించిన లెక్కలను ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పలేదని ఐటీ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే విదేశాల నుంచి ఎవరెవరు, ఎంతెంత విరాళాలు, ఏ రూపంలో ఇస్తున్నారో తెలియజేయాల్సిందిగా గత వారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు 'ఆప్'కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
మొత్తానికి వరుస వివాదాలు, సమస్యలు ఆమ్ ఆద్మీ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఢిల్లీ పురపాలక ఎన్నికల అనంతరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం)పై సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత కుమార్ విశ్వాస్ విభేధించారు.
ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడతారని కూడా జోరుగా ప్రచారం నడిచింది. అయితే సీఎం కేజ్రీవాల్ ఓ మెట్టు దిగి కుమార్ విశ్వాస్ డిమాండ్లకు తలొగ్గటంతో ఈ సమస్య సద్ధుమణిగింది. 'హమ్మయ్య' అనుకునేలోపే కపిల్ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించడంతో మరో సమస్య వచ్చిపడింది.
'ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ దగ్గర నుంచి కేజ్రీవాల్ రూ.2 కోట్లు ముడుపులు తీసుకున్నారని, అందుకు ప్రత్యక్ష సాక్షిని నేనే' అంటూ కపిల్ మిశ్రా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలా వరుసగా వచ్చి పడుతున్న సమస్యలతో ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. మరోవైపు ఆ పార్టీ విశ్వసనీయత కూడా దెబ్బతింటోంది.