మర్యాద ఉంటుంది: రాజీనామాకు సిద్దం అయిన తమిళనాడు సీఎం !
పన్నీర్ సెల్వం వర్గంతో చర్చలు పూర్తి అయిన తరువాత తన పదవికి రాజీనామా చెయ్యాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి నిర్ణయించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి సంచలన నిర్ణయం తీసుకోవడానికి సిద్దం అయ్యారని వెలుగు చూసింది. పన్నీర్ సెల్వం వర్గంతో చర్చలు జరిపిన తరువాత ఎడప్పాడి పళనిసామి కీలకనిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారని సమాచారం.
విశ్వసనీయ సమాచారం మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి పదవి, అన్నాడీఎంకే పార్టీ చీఫ్ పదవి తనకే కావాలంటున్న పన్నీర్ సెల్వం డిమాండ్ కు అంగీకరిస్తేనే మంచిదని ఎడప్పాడి పళనిసామి నిర్ణయించారని సమాచారం.
చర్చలు పూర్తి అయితే
బుధవారం సాయంత్రం పన్నీర్ సెల్వం వర్గంతో భేటీ కావాలని ఎడప్పాడి పళనిసామి వర్గం నిర్ణయించింది. పన్నీర్ సెల్వంతో చర్చలు జరిపిన తరువాత తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తప్పుకోవడం మంచిందని ఎడప్పాడి పళనిసామి నిర్ణయించారని తెలిసింది.
ఒత్తిడి తెస్తున్న వర్గీయులు
తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యరాదని ఎడప్పాడి పళనిసామి మీద ఆయన వర్గీయులు ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. అయితే ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వర్గం వైపు వెళ్లిపోతారని ఎడప్పాడి పళనిసామి ముందుగానే పసిగట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
పదవికి ఎసరు పెట్టకముందే
మెజరిటీ ఎమ్మెల్యేలు (అన్నాడీఎంకే) పన్నీర్ సెల్వం వర్గంలోకి వెళ్లి తన పదవికి ఎసరుపెట్టకముందే హుందాగా తన పదవికి రాజీనామా చేస్తే పరువు ఉంటుందని ఎడప్పాడి పళనిసామి ఆలోచిస్తున్నారని సమాచారం.
ఎడప్పాడి అంచనాలు
పన్నీర్ సెల్వం సీఎం అయినా ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉండే కీలకపదవి ఎడప్పాడి పళనిసామి చేజిక్కించుకునే అవకాశం ఉందని తెలిసింది. శశికళ ఫ్యామిలీని పార్టీ నుంచి వెలివేసిన తరువాత ఆమె అనుచరులుగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ మంత్రులు ఇప్పుడు హడలిపోతున్నారు.
చేసే అవకాశం లేదు ?
122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం అయిన ఎడప్పాడి పళనిసామి అంత త్వరగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు వర్గాలు కలిసిపోయి పార్టీ రెండాకుల చిహ్నం దక్కించుకున్న తరువాతే ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన వర్గీయులు అంటున్నారు.
బెట్టుచేసే అవకాశం
అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాలు కలిసిపోతే ఎక్కువ లాభపడే అవకాశం పన్నీర్ సెల్వం వర్గీయలకే ఉంది. పన్నీర్ సెల్వం వర్గంలోని 12 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఇక సినిమానే
శశికళ ముఖ్య అనుచరులుగా గుర్తింపు తెచ్చుకుని ఇంత కాలం బహిరంగంగా పన్నీర్ సెల్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సీనియర్ మంత్రులు సెంగోట్టయన్, ఆర్ బి ఉదయ్ కుమార్, దిండిగల్ శ్రీనివాస్, సాలూరు రాజా తదితరులకు వారి పదవులు ఊడిపోయే అవకాశం ఉందని సామాచారం.