ఆర్థిక లావాదేవీలు: మహిళా కార్పొరేటర్పై యాసిడ్ దాడి
బరేలి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలి జిల్లా ఫరీద్పూర్లో ఇద్దరు దుండగులు మహిళా కార్పొరేటర్పై యాసిడ్తో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. పరా ప్రాంతంలో కార్పొరేటర్ ముస్కాన్ దేవి(35), ఆమె భర్త సోను కలిసి వారి ఇంటి వద్దే దుకాణం నడుపుతున్నారు.
రామ్దాస్, అరవింద్ అనే వ్యక్తులతో వీరికి డబ్బు విషయంలో తగాదా రావడంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ ఇద్దరు వ్యక్తులు కార్పొరేటర్పై యాసిడ్ పోశారు. దీంతో ఆమె ముఖం, ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితుల్లో ఒకరిని పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో 14మంది బిజెపి కార్యకర్తలకు గాయాలు
రాయ్ బరేలి జిల్లాలోని పర్థౌలి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేంద్రమంత్రి మేనకా గాంధీని ఫిలిబిత్లో కలిసి.. తిరిగి న్యూఢిల్లీకి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.