నటి మమతా కుల్కర్ణికి షాక్: బ్యాంకు ఖాతాల స్తంభన
థానే: రూ. 2వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాల పట్టివేత కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి మమతా కులకర్ణి మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఆమెకు చెందిన ఎనిమిది బ్యాంకు ఖాతాలను థానే పోలీసులు స్తంభింపజేశారు.
కాగా, ఈ ఖాతాల్లో రూ.90 లక్షలకుపైగా నగదు ఉంది. రూ.రెండు వేల కోట్ల ఎఫిడ్రిన్ మాదకద్రవ్యాల రాకెట్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ చర్య తీసుకున్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యాపారి, ఆమె భాగస్వామి అయిన వికీ గోస్వామి.. ఈ ఖాతాల ద్వారా లావాదేవీలు జరిపినట్లు అనుమానిస్తున్నట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.
డ్రగ్ కేసులో ఉచ్చు బిగుస్తోంది: చిక్కుల్లో నటి మమత కులకర్ణి
మలడ్లోని ఓ బ్యాంకు ఖాతాలో రూ.67 లక్షల విలువైన విదేశీ నగదును కనుగొన్నారు. మిగిలిన రూ.26 లక్షలు థానే, గుజరాత్లోని బ్యాంకుల్లో దొరికాయి. బ్యాంకుల్లో లావాదేవీలు జరిపిన కుల్కర్ణి సోదరుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో మొత్తం 17 మందిపై ఆరోపణలు రాగా పది మందిని అరెస్టు చేశారు.
మాదకద్రవ్యాలకు సంబంధించి కెన్యా, దుబాయిలలో జరిగిన సమావేశాల్లో కుల్కర్ణి పాల్గొన్నారు. ఆ భేటీల్లో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో అవన్ లైఫ్సైన్సెస్ లిమిటెడ్లో పోలీసులు రెండు నెలల క్రితం జరిపిన సోదాల్లో రూ.రెండు వేల కోట్ల విలువైన 18.5 కిలోల ఎఫిడ్రిన్ను ఏప్రిల్లో స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.