శశికళకు ల్యాప్టాప్ ఇవ్వండి, నాశనం...: నటుడు సిద్ధార్థ ఆగ్రహం
తమిళనాడులోని రాజకీయ పరిణామాల పైన సినీ తారలు స్పందిస్తున్నారు. తాజాగా, నటుడు సిద్ధార్థ.. చిన్నమ్మ శశికళ పైన వ్యాఖ్యలు చేశారు.
చెన్నై: తమిళనాడులోని రాజకీయ పరిణామాల పైన సినీ తారలు స్పందిస్తున్నారు. తాజాగా, నటుడు సిద్ధార్థ.. చిన్నమ్మ శశికళ పైన వ్యాఖ్యలు చేశారు. జైల్లో ఉన్న శశికళకు ఓ ల్యాప్ టాప్ ఇవ్వాలని, అక్కడి నుంచే ఆమె పాలన చేస్తారని ఎద్దేవా చేశారు.
బలపరీక్ష నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీలో శనివారం చోటుచేసుకున్న సంఘటనలు రాజ్యాంగానికే సిగ్గుచేటు అని సిద్ధార్థ్ విమర్శించారు. ఈ మేరకు సిద్ధార్థ్ ట్విట్టర్లో తన సందేశాన్ని పోస్టు చేశారు.
ఈ రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు నాశనం గాక.. ఇదే ప్రస్తుతం రాష్ట్ర ప్రజల మనోగతమని, ప్రతిపక్ష హోదాలో డీఎంకే చక్కగా వ్యవహరించిందని, చట్టసభలో జరిగింది పిల్లలందరూ చూస్తున్నారన్నది గుర్తించుకొంటే బాగుండేదని, ఇది రాజ్యాంగానికే సిగ్గుచేటు అన్నారు.
శశికళకు ల్యాప్టాప్ ఇవ్వాలన్న సిద్ధార్థ
శశికళను ప్రస్తావిస్తూ... జైల్లో ఉన్న శశికళకు ఒక ల్యాప్టాప్ ఇస్తే, వచ్చే నాలుగేళ్లూ చెన్నై నుంచి బెంగళూరు జైలుకి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి రవాణా ఖర్చులు మిగులుతాయని నటుడు సిద్ధార్థ ఎద్దేవా చేశారు. అంతేకాదు, మనం తినే ఆహారంలో ఇంకా అధికంగా ఉప్పు వేసుకోవాలని తమిళుల్లో పౌరుషం తగ్గిందని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
పన్నీరు సెల్వమే ఉండాలని...
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి శనివారం శాసనసభలో నిర్వహించిన బలపరీక్షలో గెలిచిన విషయం తెలిసిందే. బలపరీక్ష తీర్పుపై ప్రముఖులు మాత్రం ముభావంగా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వమే అవ్వాలని సామాజికమాధ్యమాలద్వారా పన్నీర్కు మద్దతు తెలుపుతున్నారు.
ఈ తీర్పుతో ఏకీభవించట్లేదు
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరోసారి ఎన్నిక జరగడం ఒక్కటే సమాధానమని తన ఉద్దేశ్యమని, ప్రజలు ఈ రోజు వచ్చిన తీర్పుతో ఏకీభవించడంలేదని నటుడు అరవింద స్వామి అన్నారు.
రాజకీయ వ్యవహారాలకు
రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉండే నటి రాధికా శరత్ కుమార్ కూడా ట్విట్టర్లో స్పందించారు. ఇది అవమానం, గవర్నర్ చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆమె ట్వీట్ చేశారు.
ఇది తగదు
అంకెలాటతో ప్రజాస్వామ్యాన్ని మభ్యపెట్టపెట్టలేరని, ప్రజాస్వామం ప్రజల గళమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, పన్నీరుసెల్వాన్ని ముఖ్యమంత్రిగా చేయాలని నటి గౌతమి అన్నారు. కమల్ హాసన్ కూడా స్పందించారు. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయిందని, ఎమ్మెల్యేలకు ప్రజలు సరైన రీతిలో గుణపాఠం చెబుతారన్నారు.