బాబ్రీ కూల్చివేత: నేరం రుజువైతే అద్వానీకి 5ఏళ్ల జైలు తప్పదు..
అభియోగాలు గనుక రుజువైతే ఒక్కొక్కరు రెండు నుంచి గరిష్టంగా ఐదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కుట్ర కేసులో బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి పునర్విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ అభియోగాలు గనుక రుజువైతే ఒక్కొక్కరు రెండు నుంచి గరిష్టంగా ఐదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది.
భారత శిక్షా స్మృతి ప్రకారం రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం, దేశ సమగ్రతను దెబ్బతీసేలా ప్రసంగాలు ఇవ్వడం తదితర నేరాల కింద గరిష్టంగా వీరికి ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, సుప్రీం తీర్పుపై స్పందించిన ఉమాభారతి నేరం రుజువైతే ఉరిశిక్షకైనా సిద్దమైనేనని సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో బుధవారం నాడు కొనసాగాల్సిన తన అయోధ్య పర్యటన కొనసాగుతుందని చెప్పినప్పటికీ.. బీజేపీ చీఫ్ అమిత్షాతో సమావేశం అనంతరం ఆమె తన పర్యటన రద్దు చేసుకున్నారు. అమిత్ షా సూచన మేరకే ఆమె తన పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం.