'చికెన్ మామూస్'లో కుక్క మాంసం: రెస్టారెంట్లకు వెళ్లాలంటేనే బెంబేలు..
ఢిల్లీలోని కొన్ని హోటల్స్ కుక్క మాంసంతో 'చికెన్ మొమొస్'ను తయారుచేస్తున్నట్లు అక్కడి అధికారులకు ఫిర్యాదులు అందాయి.
న్యూఢిల్లీ: కల్తీ ఆహార పదార్థాల గురించి వింటుంటే.. హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్లాలంటేనే చాలామంది జనం భయపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా మాంసాహారం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే.. ఏ కుక్క మాంసమో?.. పిల్లి మాంసమో? కడుపులోకి వెళ్లడం ఖాయం.
అప్పట్లో చెన్నైలోని కొన్ని హోటల్స్ లో పిల్లి మాంసంతో బిర్యానీ తయారుచేసినట్లే.. తాజాగా ఢిల్లీలోని కొన్ని హోటల్స్ కుక్క మాంసంతో 'చికెన్ మామూస్'ను తయారుచేస్తున్నట్లు అక్కడి అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో శుక్రవారం నగరంలోని పలు హోటల్స్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఢిల్లీ కంటోన్మెంట్ పరిధిలోని పలు హోటల్స్ ఫుడ్ క్వాలిటీని అధికారులు పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించని 20హోటల్స్ ను మూసివేయించారు. అలాగే కంటోన్మెంట్ ప్రాంతంలోని ఆర్మీ క్యాంటీన్ లోను చికెన్ మామూస్ విక్రయాలను నిలిపివేయించారు.
ఈ మేరకు ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి రెడ్డి శంకర్ బాబు వివరాలు వెల్లడించారు. కంటోన్మెంట్ పరిధిలోని పలు హాటళ్లపై కస్టమర్ల నుంచి తమకు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. అందులో భాగంగానే పలు హోటల్స్ లో తనిఖీలు నిర్వహించామని, కొన్ని హోటల్స్ లో అపరిశుభ్ర మాంసాన్ని వినియోగిస్తున్నట్లు తేలిందని అన్నారు.