చేజేతులా..: శశికళ ఖేల్ ఖతం?: పీఠం ఎక్కిస్తే వారే రివర్స్!
చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఆయన అక్క కొడుకు దినకరన్ రాజకీయ జీవితానికి చెక్ పడినట్లేనా? వారి రాజకీయ హడావుడి అంతా మూణ్ణాళ్ల ముచ్చటేనా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
శశికళ లేదా దినకరన్లు ప్రత్యర్థుల చేతికి దొరకడంతో పాటు వారి గోతి వారే తవ్వుకున్నట్లుగా ఉందని అంటున్నారు. జయలలిత మృతి తర్వాత పార్టీ అధినేత్రిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వెంట వెంటనే కావాలని శశికళ ఉవ్వీళ్లూరారు. దాని ఫలితమే జైలు జీవితం అంటున్నారు.
ఇప్పుడు టిటివి దినకరన్ కూడా తప్పు చేసి అడ్డంగా దొరికిపోయి, విపక్షాలకు, పన్నీరుసెల్వం వర్గానికి ఛాన్సిచ్చారని అంటున్నారు. ఈ కారణంగా శశికళ వర్గంలోనే ఇప్పుడు ఎదురు దాడి ప్రారంభం అయింది. ఈసికి రూ.50 కోట్ల కేసులో దినకరన్పై ఢిల్లీలో కేసు నమోదయింది.
చిక్కుల్లో దినకరన్
ఆయనను విచారించేందుకు ఢిల్లీ పోలీస్ టీం చెన్నై వచ్చింది. ఆయనను ఏ సమయంలోనైనా అరెస్టు చేయవచ్చునని అంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు కూడా దినకరన్, శశికళలను తప్పించాలని వారి వర్గంలోని నేతలే డిమాండ్ చేస్తున్నారు.
శశికళ పీఠం ఎక్కించిన పళనిస్వామి రివర్స్ అవ్వాల్సిన పరిస్థితి
ఇది పన్నీరుసెల్వం వర్గానికి పెద్ద ఊరట. ముఖ్యమంత్రి పళనిస్వామి ఇప్పుడు ఇరుకున పడ్డారు. తనను శశికళ సీఎంగా చేసినా.. పార్టీ కోసం మంత్రులు, ఇతర నేతల ఎమ్మెల్యేల డిమాండుకు తలొగ్గవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
పళనిస్వామి దిగి రావాల్సిందే
తాజాగా, మాజీ సీఎం పన్నీరుసెల్వం మాట్లాడుతూ.. శశికళ, ఆమె కుటుంబాన్ని పార్టీకి దూరంగా పెడితేనే అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు కలుస్తాయని కుండబద్దలు కొట్టారు. పార్టీ కోసం వారిని పక్కన పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు. పళని వర్గం దిగివచ్చే పరిస్థితి.
ఎంత వేగంగా వచ్చారో..
సొంత పార్టీయే దూరం కొడితే ఇక శశికళ, దినకరన్ల రాజకీయ జీవితానికి తెరపడినట్లేనని అంటున్నారు. జయలలిత తర్వాత ఎంత వేగంగా రాజకీయాల్లో దూసుకెళ్తామని అనుకున్నారో, అంతే వేగంగా వారి పతనం ఖాయమయినట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. జయ మృతి అనంతరం పన్నీరును శశికళ సీఎం చేశారు. ఆయన ఎదురు తిరిగారు. ఆ తర్వాత పళనిని సీఎం చేశారు. ఇప్పుడు ఆయన ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.