సీట్లన్నీ పుల్: రేపటి నుంచే ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో ప్లైట్
న్యూఢిల్లీ: సిలికాన్ వ్యాలీలో పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు నాన్స్టాప్ ప్లైట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఎయిర్ ఇండియా రేపటి (డిసెంబర్ 2) నుంచి కొత్తగా ఈ సర్వీసుని ప్రారంభించనుంది.
ఈ తరహా విమాన ప్రయాణం ఇప్పటిదాకా ప్రయాణికులకు అందుబాటులో లేకపోవడంతో ఈ ప్రయాణాన్ని ఆస్వాదించేందుకు విమాన ప్రయాణికులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. న్యూఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్లైట్ టేకాఫ్ అయిందంటే, మళ్లీ శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ల్యాండ్ అవుతుంది.
రేపటి నుంచి ప్రారంభించనున్న ఈ విమాన సర్వీసులో ఇప్పటికే సీట్లు అన్నీ దాదాపు బుక్ అయ్యాయి. 238 సీట్లలో 98 శాతంపైగా బుక్ అయ్యాయని ఎయిర్ ఇండియా అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నాన్స్టాప్ విమానంలో ప్రయాణించేందుకు గాను బెంగుళూరుతో సహా ఏడు ప్రధాన నగరాల నుంచి టిక్కెట్లను బుక్ చేసుకున్నారు.
ఎక్కవశాతం టిక్కెట్లను బెంగుళూరు నుంచే బుక్ అయినట్లు అధికారులు వెల్లడించారు. వీరందరినీ మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి చిన్న విమానంలో ఢిల్లీకి తీసుకొస్తామని, బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు బయల్దేరే నాన్ స్టాప్ ప్లైట్లో ఎక్కిస్తామని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి వి. చంద్రశేఖర్ తెలిపారు.
కాగా న్యూఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు నాన్స్టాప్ బోయింగ్ విమానం 777 ఎల్ఆర్ వారానికి మూడుసార్లు(బుధ, శుక్ర, ఆదివారాలు) నడపనున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. ఇదే విమానం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి గురు, శని, సోమవారాల్లో తిరిగి న్యూఢిల్లీకి బయలుదేరుతుంది.