తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ: ఎమ్మెల్యేలకు సీబీఐ గుబులు, చొక్కాలు చింపిస్తే !
తమిళనాడు శాసన సభ సమావేశాలు ప్రారంభం అయిన రోజు ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలు రచ్చరచ్చ చేశారు.
చెన్నై: తమిళనాడు శాసన సభ సమావేశాలు ప్రారంభం అయిన రోజు ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలు రచ్చరచ్చ చేశారు. కోట్ల రూపాయల ముడుపులు తీసుకుని అధికార పార్టీకి మద్దతు ఇస్తున్న అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చేతులు ఎత్తేసిన పన్నీర్ సెల్వం: రేపే అసెంబ్లీ సమావేశం, మెజారీటి లేదంటే సీఎం ఢమాల్ !
ముఖ్యమంత్రికి మద్దతు ఇస్తూ బలపరీక్షలో ఓటు వేసిన ఎమ్మెల్యేలు ఎంతెంత ముడుపులు తీసుకున్నారు ? అనే విషయం వెలుగు చూడాలని, అసెంబ్లీలో చర్చకు అనుమతి ఇవ్వాలని డీఎంకే పార్టీ శాసన సభ్యులు స్పీకర్ పి. ధనపాల్ చాంబర్ ముందు ఆందోళనకు దిగారు.
రూ. ఎన్ని కోట్లు తీసుకున్నారు ?
బుధవారం శాసన సభ సమావేశం ప్రారంభం అయిన వెంటనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడింట్ ఎం.కే. స్టాలిన్ మాట్లాడుతూ అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ ఎమ్మెల్యేలు కోట్ల రూపాయల ముడుపులు తీసుకుని సీఎం ఎడప్పాడి పళనిసామికి మద్దతుగా ఓటు వేశారని ఆరోపించారు.
ఆదేశాలు ఇవ్వండి !
అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ ఎమ్మెల్యేలు ఎవరెవరు రూ. ఎన్ని కోట్లు ముడుపులు తీసుకున్నారు ? అని చర్చ జరగడానికి మీరు అనుమతి ఇవ్వాలని ఎంకే. స్టాలిన్ స్పీకర్ ధనపాల్ కు మనవి చేశారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే రూ. కోట్లు ముడుపులు తీసుకుని అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న వారు ఎవరో ప్రజలకు తెలియాలి అంటూ పట్టుబట్టారు.
ఆందోళన వద్దు !
శాసన సభ సమావేశం జరుగుతున్న సమయంలో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తే సభ సవ్యంగా జరగదని, మీరు మీ కుర్చీల్లో కుర్చోవాలని స్పీకర్ ధనపాల్ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు మనవి చేశారు. అయితే వారు మాత్రం అవినీతి అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు ఎవరో తెలియాలి అంటూ నినాదాలు చేశారు.
రచ్చ రచ్చ అయ్యింది !
ఓ ఆంగ్ల జాతీయ మీడియా అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు రూ. 2 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు ముడుపులు తీసుకుని అధికార పార్టీకి మద్దతుగా బలపరీక్షలో ఓటు వేశారని వార్తలు ప్రసారం చేసింది. మీడియాలో ప్రసారం అయిన క్లిప్పింగ్స్ ఉన్న ఫ్లెక్సీలు, ఫ్లే కార్డులు చేతపట్టుకున్న డీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ ధనపాల్ చాంబర్ దగ్గర ఆందోళనకు దిగడంతో సమావేశం రచ్చరచ్చ అయ్యింది.
అదే సీన్ రిపీట్ అవుతుందా ?
ఫిబ్రవరి నెలలో సీఎం ఎడప్పాడి బలపరీక్ష నిరూపించుకునే సమయంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశం నుంచి బయటకు లాక్కెళ్లిన విషయం తెలిసిందే. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ చొక్కా చింపేయడంతో ఆయన నేరుగా చిరిగిన చొక్కాతోనే రాజ్ భవన్ చేరుకుని గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఫిర్యాదు చేశారు. ఈ రోజులాగే మళ్లీ జరుగుతుందా ? అంటూ తమిళనాడులో పెద్ద చర్చ మొదలైయ్యింది.
సీబీఐ దర్యాప్తు ?
అన్నాడీఎంకే ప్రభుత్వం విశ్వాస పరీక్ష సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఎరవేశారనే ఆరోపణలపై సీబీఐ. అవినీతి నిరోధక శాఖలతో దర్యాప్తు చేయించాలని కోరుతూ డీఎంకే పార్టీ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.
ఆందోళనలో అధికార పార్టీ !
మద్రాసు హైకోర్టులో డీఎంకే పార్టీ వేసిన పిటిషన్ ఈనెల 16వ తేదీన విచారణ జరగనుంది. ఆ సమయంలో మద్రాసు హైకోర్టు సీబీఐ విచారణకు అనుమతి ఇస్తే మన పని అయిపోతుందని కొందరు అన్నాడీఎంకే నాయకులకు గుబులు పుట్టిందని సమాచారం. మొత్తం మీద అధికార పార్టీకి మద్దతు ఇవ్వడానికి కోట్లరూపాయలు ముడుపులు తీసుకున్న ఎమ్మెల్యేలకు నిద్రలేకుండా పోయిందని ఆ పార్టీలోని నాయకులే అంటున్నారు.