పార్టీ చీఫ్ పదవా.. 28లోగా జవాబివ్వండి: శశికళకు ఈసీ మరో షాక్
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో జైలులో ఉన్న శశికళకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది.
చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో జైలులో ఉన్న శశికళకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. పార్టీ అధినేత్రిగా ఎన్నిక కావడంపై ఈ నోటీసులు జారీ అయ్యాయి.
అన్నాడీఎంకే తాత్కాలిక అధినేత్రిగా శశికళను ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పన్నీరు సెల్వం వర్గం.. శశికళ వర్గం మధ్య విభేదాలు పొడసూపాయి. దీంతో పన్నీరు సెల్వం వర్గం.. శశికళ ఎన్నికను సవాల్ చేస్తూ ఈసికి ఫిర్యాదు చేసింది.
'సీఎం'గా చిన్నమ్మ శశికళ.. జైలులో: సోషల్ మీడియాలో ఇలా..
ఈ నేపథ్యంలో ఏ ప్రాతిపదికన పార్టీ అధినేత్రిగా ఎన్నికయ్యారో చెప్పాలంటూ ఈసీ శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 28వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులో పేర్కొంది. ఆ లోగా స్పందించకుంటే ఈసీ షాక్ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి.
కాగా, పన్నీరు సెల్వం వర్గానికి చెందిన 11 మంది ఎంపీలు కలిసి శశికళకు వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్దంగా ఆమె పార్టీ పదవిని చేపట్టినట్లు పేర్కొన్నారు. అంతకుముందు, పార్టీ నుంచి బహిష్కరించబడిన శశికళ పుష్ప కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు.
శశికళకు పన్నీరు గట్టి షాక్: జయలలితకు ఇచ్చిన మాట తప్పారని తొలగింపు
పార్టీ నిబంధనల మేరకు.. పార్టీ అధినేత్రి పదవి చేపట్టాలంటే ఆ అభ్యర్థి అయిదేళ్లుగా పార్టీ మెంబర్గా ఉండాలి. శశికళ పార్టీ మెంబర్గా అయిదేళ్ల పాటు లేరు కాబట్టి.. ఆమె పార్టీ చీఫ్ పదవికి అనర్హురాలు అని ఎంపీ మైత్రేయన్ చెబుతున్నారు.