పళని ప్రభుత్వంపై స్టాలిన్, ప్రశ్నలు ముందే చెప్పాలన్న శశికళకు షాక్
పళనిస్వామి ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిఎంకె నేత ఎంకె స్టాలిన్ సోమవారం నాడు డిమాండ్ చేశారు.
చెన్నై: పళనిస్వామి ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిఎంకె నేత ఎంకె స్టాలిన్ సోమవారం నాడు డిమాండ్ చేశారు. పళనిస్వామి విశ్వాస పరీక్ష సమయంలో శశికళ వర్గం, పన్నీరుసెల్వం వర్గం ఎమ్మెల్యేలను రూ. కోట్లకు కొనుగోలు చేసినట్లు వెలుగు చూసిన విషయం తెలిసిందే.
చదవండి: స్టింగ్ సంచలనం: ఒక్కో ఎమ్మెల్యేకు రూ.4కోట్లిచ్చిన శశికళ, పన్నీరు కూడా
ఈ నేపథ్యంలో స్టాలిన్ స్పందించారు. వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్నారు. డబ్బుతో అన్నాడీఎంకే నేతలు దేనినైనా కొనగలరని వ్యాఖ్యానించారు.
అన్నాడీఎంకేలో పనళనిస్వామి వర్గం, పన్నీరుసెల్వం వర్గాలు అంటూ రెండూ వేర్వేరుగా ఏమీ లేవని చెప్పారు. అందరూ మాఫియాలేనని స్టాలిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రశ్నలు ముందే చెప్పాలన్న శశికళ పిటిషన్ కొట్టివేత
తమిళనాడు ముఖ్యమంత్రి పదవి కోసం ఆశపడి భంగపాటుకు గురైన శశికళ ప్రస్తుతం ఆక్రమాస్తుల కేసులో జైలులో ఉంటున్నారు. విదేశీ మారక ద్రవ్య కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయనున్న విచారణలో తనను అడగనున్న ప్రశ్నలను ముందే తనకు చెప్పాలని ఇటీవల ఆమె కోర్టులో పిటిషన్ వేశారు.
అయితే, ఆమె పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. ఈ విచారణ అంశం అధికారులకు, నిందితులకు మధ్య మాత్రమే ఉండాలని ఈడీ తన పిటిషన్లో న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు కోర్టు తాజా నిర్ణయం తీసుకుంది. శశికళ కోర్టుకు వచ్చి విచారణను ఎదుర్కోవాల్సి ఉండగా, ఆమె ప్రస్తుతం జైలులో ఉంటున్న కారణంగా అది కుదరక వీడియో కాన్ఫ్రెన్స్ ద్వారా అధికారులు ఆమెను ప్రశ్నించనున్నారు.