రివర్స్ వ్యూహం: సీఎంగా పన్నీరుసెల్వం, శశికళకు పళనిస్వామితో చెక్!
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. నిన్న మిత్రులుగా ఉన్న పార్టీలు, రేపు శత్రువులుగా మారుతాయి.
చెన్నై: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. నిన్న మిత్రులుగా ఉన్న పార్టీలు, రేపు శత్రువులుగా మారుతాయి. శత్రువులుగా ఉన్న నాయకులు మిత్రులు అవుతారు. అన్నాడీఎంకేలోని రెండు వర్గాల పరిణామాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి.
ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ మలుపు తిరుగుతుందో అర్థం కావడం లేదు. శశికళను, దినకరన్లను పార్టీ నుంచి బయటకు పంపించడం, జయలలిత మృతిపై విచారణ జరిపించాలని.. ఇలా పలు డిమాండ్లను పన్నీరుసెల్వం వర్గం పళనిస్వామి వర్గం ముందు పెట్టిన విషయం తెలిసిందే.
ఈ రోజు ఇది, రేపు మరొకటి: పన్నీరుసెల్వంపై శశికళ నిప్పులు
ఇరువర్గాలు కూడా విలీనం అంశంపై బహిరంగంగా, రహస్యంగా చర్చించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పలు డిమాండ్లు, పలు ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.
ఓసారి పన్నీరు సీఎం అని, మరోసారి పళనిస్వామియే సీఎం అని, ఇంకోసారి పన్నీరు ఆర్థిక మంత్రి అంటున్నారు. మొత్తానికి విలీన చర్చల్లో భాగంగా ఎప్పటికప్పుడు తెరపైకి కొత్త కొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా, మరో అంశం తెరపైకి వచ్చింది.
కీలక చర్చలు..
చర్చల కోసం ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గం శుక్రవారం పార్టీ ఎంపీ వైద్యలింగం నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ సీఎం పన్నీర్సెల్వం వర్గం మాజీ మంత్రి కెపిమునుస్వామి అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీల మధ్య ఆదివారం రాత్రి లేక సోమవారం కీలక చర్చలు జరిగే అవకాశముందని ప్రచారం సాగుతోంది.
పన్నీరు డిమాండ్, గుంభనంగా పళనిస్వామి
ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి పదవులు రెండూ తమకే కావాలని పన్నీర్సెల్వం వర్గం కోరుతోంది. పళనిస్వామికి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, ఆర్థికశాఖ ఇస్తామని చెబుతోంది. పళనిస్వామి వర్గం తమ డిమాండ్లను బహిరంగంగా వ్యక్తం చేయడం లేదు. సాధ్యమైనంత వరకు ఇరువర్గాలు ఒక్కటై, పార్టీ గుర్తును కాపాడుకోవాలని చూస్తున్నామని రాష్ట్ర మున్సిపల్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి వేలుమణి చెప్పారు.
సీఎంగా పన్నీరుసెల్వం, పార్టీ చీఫ్గా పళనిస్వామి
చర్చల్లో భాగంగా తెరపైకి కొత్త ప్రతిపాదన కూడా వచ్చిందని తెలుస్తోంది. పన్నీరుసెల్వంకు ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న పళనిస్వామిని పార్టీ ప్రధాన కార్యదర్శిని చేస్తామని, అలాగే ఆర్థిక శాఖ ఇస్తామని పన్నీరువర్గం చెబుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ చీఫ్గా శశికళ ఉన్నారు. విలీనం జరిగితే ఆమె స్థానంలో పళనిని ఎన్నుకుంటామని చెబుతున్నారు.
ఎన్నికల సంఘం ఇచ్చిన గడువులోగా..
చర్చలు సానుకూలంగా జరుగుతాయని న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా అంతా మంచి జరుగుతుందని చెబుతున్నారని తెలిపారు. రెండాకుల గుర్తు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు అన్నాడీఎంకేలోని రెండు వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం జూన్ 16 వరకు గడువు ఇచ్చింది.
దొడ్డిదారిలో అవసరం లేదని వెంకయ్య
మరోవైపు, అన్నాడీఎంకేలోని రాజకీయ వ్యవహారాల్లో బీజేపీ జోక్యం చేసుకోదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. దొడ్డిదారిన అధికారాన్ని చేపట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగాలని తమ ప్రభుత్వం కోరుకుంటోందన్నారు.