పార్టీ పత్రికలో 'శశికళ' కథనం: పళనికి షాకిచ్చిన పన్నీరుసెల్వం
అన్నాడీఎంకేలో 'విలీన' సస్పెన్స్ కొనసాగుతోంది. పళనిస్వామి వర్గం, పన్నీరుసెల్వం వర్గం ఈ రోజు భేటీ అయి, రెండు వర్గాల విలీనం అంశంలో ఏదో ఒకటి తేల్చుతారని భావించారు.
చెన్నై: అన్నాడీఎంకేలో 'విలీన' సస్పెన్స్ కొనసాగుతోంది. పళనిస్వామి వర్గం, పన్నీరుసెల్వం వర్గం ఈ రోజు భేటీ అయి, రెండు వర్గాల విలీనం అంశంలో ఏదో ఒకటి తేల్చుతారని భావించారు. అయితే, మరోసారి విలీన ప్రతిపాదనలో ప్రతిష్టంభన ఏర్పడింది.
పార్టీ గుర్తు కోసం రెండుగా చీలిపోయిన వర్గాలు విలీనం దిశగా అడుగు వేసినప్పటికీ అది ముందుకు సాగడం లేదు.
మీరు తప్పుకోండి: మంత్రికి షాక్, దాడి.. దినకరన్ వర్గీయుల పరుగు
జయలలిత మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించడంతో పాటు, శశికళ, దినకరన్, చిన్నమ్మ కుటుంబ సభ్యులను పార్టీ నుంచి తొలగించేంత వరకు విలీన ప్రస్తావనే లేదని పన్నీర్ వర్గం సోమవారం మళ్లీ స్పష్టం చేసింది. చర్చల మాటే లేదని తేల్చి చెప్పారు. దీంతో ప్రతిష్టంభన ఏర్పడింది.
మంత్రి వ్యాఖ్యలు
పన్నీర్కు ఆర్థిక శాఖ ఇస్తామని, పళనిస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని పళనిస్వామి వర్గం తరఫున మంత్రి జయకుమార్ వ్యాఖ్యానించారు. దీంతో పాటు తాజాగా సోమవారం ఆ పార్టీ పత్రికలో వచ్చిన కథనంతో పన్నీరుసెల్వం వర్గం ఆగ్రహంతో ఉంది.
పార్టీ పత్రిక కథనంపై పన్నీరు ఆగ్రహం
పార్టీ పత్రిక అయిన నమదు ఎంజీఆర్లో పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్కు ఇంకా పార్టీ వర్గాల నుంచి ప్రజల నుంచి మద్దతు ఉందంటూ సోమవారం ఓ కథనం వచ్చింది. దీంతో పన్నీరుసెల్వం వర్గం తమ డిమాండ్లపై పట్టుబడుతున్నాయి. డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నాయి.
ఇంకా శశికళ చేతిలోనే..
పార్టీ పత్రికలో వచ్చిన దానిని బట్టి చూస్తుంటే ఇంకా అన్నాడీఎంకే శశికళ చేతిలో ఉందన్న విషయం స్పష్టమవుతోందని పన్నీరుసెల్వం వర్గానికి చెందిన కేపీ మునుస్వామి చెప్పారు. తాము చెప్పినట్లు జయ మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించాల్సిందే అన్నారు.
పూటకో విధంగా..
అలాగే, శశికళ, దినకరన్తో పాటు వారి కుటుంబ సభ్యులను పార్టీ నుంచి తొలగించేవరకు విలీనంపై ముందుకెళ్లేది లేదని పన్నీరు వర్గం తేల్చి చెప్పింది. అవతలి వర్గం వారు పూటకో విధంగా మాట్లాడుతున్నారని, తమ డిమాండ్లను అంగీకరించాకే చర్చలపై ముందుకెళతామన్నారు.